లాక్డౌన్ నేపథ్యంలో తిరుమల శ్రీవారి దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. జనసంచారం అంతగా లేకపోవడంతో.. కొండపై వన్య ప్రాణులు, జంతువులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో శ్రీవారి తిరునామంతో ఉన్న ఓ గోవు కనిపించింది. వెంకటేశ్వర స్వామి నుదట ధరించే తిరునామం మాదిరిగానే.. ఆవు నుదుట కూడా సహజసిద్ధంగా తిరునామం ఆకారం ఉంది. ఈ ఆవును చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాక్షాత్తు వెంకటేశ్వరుడిని చూస్తున్నట్లుగా ఉందని కొందరు భక్తులు అభిప్రాయపడ్డారు. తిరునామంతో ఉన్న ఆ గోవును టీటీడీ గోశాలకు తరలించారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటం వల్ల తిరుమల శ్రీవారి ఆలయంలో మే 3 వరకూ భక్తులకు అనుమతి లేదు. ఐతే ఆలయంలో స్వామి వారికి రోజువారీ కైంకర్యాలు, పూజలు మాత్రం నిర్వహిస్తున్నారు. నెల రోజులుగా శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆదాయం టీటీడీ కోల్పోయింది. గత నెల 19 నుంచి టీటీడీ ఘాట్ రోడ్లను మూసివేసింది. 20 మధ్యాహ్నం నుంచి శ్రీవారి దర్శనానికి భక్తులను నిలిపివేసింది. శ్రీవారి దర్శనానికి భక్తులను ఎప్పుడు అనుమతి ఇచ్చేది... టీటీడీ త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd