టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తిరుమలలోని అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి సభ్యులు సమావేశంకానున్నారు. ఇందులో ముఖ్యంగా సుమారు 80 అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.
2020-21 ఆర్థిక సంవత్సరానికిగానూ వార్షిక బడ్జెట్ టీటీడీ ప్రవేశపెట్టినా.. కోవిడ్ మహమ్మారి భయం కారణంగా కొంతకాలం దర్శనాలు రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తరువాత దర్శనాలు ప్రారంభించినా కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. గతంతో పోల్చుకుంటే భక్తుల సంఖ్య కాస్త తగ్గడంతో వివిధ ఆదాయ మార్గాలకు సగానికిపైగా గండి పడినట్టు సమాచారం. వీటిన్నింటి బేరీజూ వేసుకుంటూ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇటీవల పరిణామల నేపథ్యంలో ముఖ్యంగా బడ్జెట్ సవరణపై చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే శ్రీవారి ఆర్జిత సేవల నిర్వహణ, వివిధ సేవలకు భక్తుల అనుమతిపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు కల్యాణమస్తు నిర్వహించాల్సిన ప్రదేశాల ఎంపికపై.. పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
అజెండాలో భాగంగా పౌరోహిత సంఘానికి చెందిన పురోహితులను.. సుపథం మార్గం ద్వారా దర్శనానికి అనుమతించే అంశంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తం 176 మంది కుటుంబాలకు సుపథం మార్గం ద్వారా దర్శనం కల్పించడం పై ఎప్పటి నుంచి డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలోదీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది పాలకమండలి. 139 మంది తిరుమల నిర్వాసితులకు ఉద్యోగాలు పర్మినెంట్ చేసే అంశంపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీటీడీ వేద పాఠశాలలకు ఎస్వీ వేద విజ్ఞాన పీఠంగా పేరు మార్పుపైనా నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే టీటీడీ ఆరోగ్య విభాగానికి సంబంధించి 8 మంది జూనియర్ వాటర్ ఎనలిస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా తీసుకునే విషయమై చర్చ జరగనుంది. టీటీడీ విజిలెన్స్ డిపార్ట్ మెంట్ 300 మంది ఎక్స్ సర్వీస్ మెన్ ను ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్ మెంట్ ఆర్గనైజేషన్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన తీసుకునే విషయంపైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అన్నిటికన్నా ముఖ్యంగా టీటీడీ డిపాజిట్లపై తక్కువ వడ్డీ ఇచ్చిన కారణంగా యాక్సిస్ బ్యాంకును బ్లాక్ లిస్ట్ లో పెట్టేలా తీర్మానం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో డిపాజిట్ చేసే అంశంపైనా చర్చ జరగనుంది. వీటితో పాటు టేబుల్ అజెండాగా మరికొన్ని ఆంశాలపైనా చర్చించి, తీర్మానించనున్నారు. తిరుపతిలోని తుమ్మలగుంట దగ్గర ఉన్న ఓల్డ్ గ్యాస్ బిల్డింగ్ ను తెలుగు అకాడమీకి మూడేళ్లకు కేటాయించే విషయంపై తీర్మానం చేసే అవకాశం ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.