TRIBES FOLLOWING UNIQUE AND DANGEROUS TRADITIONS IN EAST GODAVARI DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Tribes Tradition: బిడ్డ పుట్టాలంటే కీడుపాకకు వెళ్లాల్సిందే..! ఆ మూడు రోజులూ అక్కడే..! ఏపీలో వింత ఆచారం..
ప్రతీకాత్మకచిత్రం (Photo Credit: Facebook)
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ (Telangana) నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari) లో విలీనమైన నాలుగు విలీన మండలాల్లో కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా ఉంటారు..
రాకెట్ యుగంలోనూ కొన్నిచోట్ల మూఢనమ్మకాలే రాజ్యమేలుతున్నాయి. ఎప్పుడు ఎక్కడ మూఢనమ్మాల మాట వచ్చినా అక్కడ మొదటగా బలి అయ్యేది మహిళలే. మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఇలాకాలో కుప్పం నియోజకవర్గంలోని… ఓ ఊర్లో మహిళలు బహిష్టు సమయంలో ఊరి చివర ఉన్న ఒక పాడుపడిన గదిలోనే ఉండాలనే నిబంధన ఉంది. అధికారులు ఎన్ని సార్లు వెళ్లి చెప్పినా ఆ గ్రామపెద్దలు ఎవ్వరూ వినలేదు సరికదా మారడానికి ప్రయత్నించట్లేదు. ఇప్పుడు సరిగ్గా అలాంటి మూఢవిశ్వాసమే తూర్పుగోదావరి జిల్లాలో వెలుగుచూసింది. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ (Telangana) నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి జిల్లా (East Godavari) లో విలీనమైన నాలుగు విలీన మండలాల్లో కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా ఉంటారు.
కొండరెడ్డి తెగకు చెందినవారి జీవన విధానం మిగిలిన గిరిజన జాతులతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది. వారిలో సగానికిపైగా నిరక్షర్యాసులే ఉంటారు. కూనవరం, చింతూరు, వీఆర్ పురం, ఎటపాక మండలాల్లో సుమారు 8వేల మంది జనాభా నివసిస్తున్నారు. అయితే ఈ కొండరెడ్డి గిరిజనులను తరతరాలుగా మూఢవిశ్వాసాలే శాసిస్తున్నాయి.
నేటికి కొనసాగుతున్న దురాచారం..!
పూర్వం నుంచే కొండరెడ్లలో కీడుపాకల అనే ఓ దురాచారం కొనసాగుతోంది. అంటే కొండరెడ్డి మహిళలు నెలసరి, ప్రసవ సమయాల్లో ఊరికి దూరంగా ఓ పాకలో ఉండాలి. ఆ సమయంలో వారి సొంత కుటుంబ సభ్యులకు గానీ, గ్రామస్తులకు ఎట్టిపరిస్థితుల్లో కనిపించకూడదు. ఆ సమయంలో మహిళలు ఊరి బయట పాడుపడినట్లు ఉండే ఆ పూరిపాకల్లో ఒంటరిగా ఉండాలి.
నెలసరి సమయం నాలుగైదు రోజుల్లో పరాయి మగవాళ్లు ఎవ్వరూ ఆమెను చూడకూడదు. ఆ మహిళకు పెళ్లి అయ్యిఉంటే భర్త మాత్రమే ఆహారం తీసుకువెళ్లాలి. అయితే అతను కూడా కేవలం ఆమెకు కావాల్సిన ఆహారాన్ని అక్కడ పెట్టి ఆమెకు కనిపించకుండా తిరిగి వచ్చేయాలి.
ప్రసవ సమయంలోమరింత ఘోరం..!
ప్రసవ సమయంలో గర్భిణుల వేధన మరింత ఘోరం. వాళ్లు ఆ పాకలో రెండు నెలలకు పైగా ఉండాలి. ఇంకా దారుణం ఏంటంటే ప్రసవం కూడా ఆ పూరిపాకలోనే…అదికాకుండా పుట్టిన బిడ్డకు ఆ తల్లే బొడ్డుపేగు కత్తిరించి ముడివేయాలి. ఈ ఆచారాన్ని పాటిస్తేనే తమకు ఎలాంటి రోగాలు దరిచేరవని వాళ్ల విశ్వాసం. అయితే ఈ కీడుపాక ఆచారం వల్ల సకాలంలో వైద్యం అందక, పురుటినొప్పులు పడలేక బాలింతలు, అప్పుడే పుట్టిన బిడ్డలు మృత్యువాడ పడుతుండేవారు.
చొరవ చూపుతోన్న ప్రభుత్వం
ఈ కొండరెడ్ల ప్రజల దురాచారాన్ని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం చింతూరు ఐటీడీఏ (ITDA) పరిధిలో ఒక స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. మొదట్లో అధికారులు ఎంతగా నచ్చచెప్పినా … అక్కడి మహిళలే ఈ ఆచారాన్ని విడిచిపెట్టలేదు. దీంతో అధికారులు ఆ కీడు పాకకు ప్రత్యామ్నాయంగా ఊరి చివర్లో ఉన్న పాకకు బదులు ఒక చిన్నపాటి భవనాలను నిర్మించారు. వాటిలో మంచినీరు, కరెంట్, బాత్రూమ్లు వంటి కనీససౌకర్యాలు కల్పించారు.
అక్షరాస్యత ఉంటే మార్పువస్తుందనే ఆశతో…!
ఈ కొండరెడ్ల గిరిజనుల్లో 70శాతం మంది నిరక్ష్యరాస్యులే ఉన్నారు. దీంతో అక్కడి పిల్లలను చదువు వైపు నడిపించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడతున్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలిస్తున్నాయి. గిరిజనులు ఇప్పుడిప్పుడే దారిలోకి వస్తున్నారు. అమ్మఒడి, విద్యాకానుక వంటి పథకాలను వాళ్లకు వివరిస్తూ…అక్కడి పిల్లలను బడులకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో మూడో తరగతి నుంచి డిగ్రీ వరకు వెయ్యికి మించి లేని విద్యార్థుల సంఖ్య… ఇప్పుడు 1,500 మందికి పెరగడం మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.
కాన్పులపై పెరిగిన అవగాహన
గర్భిణులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా కీడుపాకల వల్ల తలెత్తే దుష్ఫలితాలపై అవగాహన కల్పిస్తుండటంతో కొందరు గర్భిణులు కాన్పుల కోసం పీహెచ్సీలకు వెళుతున్నారు. ఆస్పత్రిలో కాన్పయితే ప్రభుత్వం జేఎస్వై క్రింద తక్షణం రూ.వెయ్యి, ఆరోగ్యశ్రీ కార్డుంటే రూ.4000 ఇస్తున్న విషయాన్ని ఏఎన్ఎం, ఆశాలు, అంగన్వాడీ సిబ్బంది కొండలపైకి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు.
దీంతో చింతూరు మండల ఏరియా ఆస్పత్రి, కూనవరం మండలం కూటూరు, వీఆర్ పురం మండలం రేకపల్లి పీహెచ్సీలకు కాన్పులకు వచ్చే గర్భిణిల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చింతూరు డివిజన్లో గతంలో ఏడాదికి కాన్పులు వందలోపే ఉండేవి. ప్రభుత్వ చర్యలతో ఈ ఏడాది ఆ కాన్పుల సంఖ్య పెరిగింది. ఇప్పటికి కొంతమందిలో మార్పు వచ్చింది. మార్పు అయితే మొదలయ్యింది. త్వరలో ఆ గ్రామ ప్రజలే ఆ దురాచారానికి దూరంగా జరిగి..ఆ కీడుపాక మూఢనమ్మకానికి చరమగీతం పాడాలని కోరుకుందాం…!
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.