తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 'యువగళం' పేరుతో పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. యాత్రలో యువత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై దృష్టిసారిస్తారు. 400 రోజులపాటు 4వేల కిలోమీటర్లు సాగే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మూడో రోజు కొనసాగుతోంది. ఆయన పాదయాత్రలో టీడీపీ కార్యకర్తలు, ప్రజలు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే లోకేశ్ అందరికీ షేక్ హ్యాండ్లు ఇవ్వడం సెల్ఫీలు తీసుకోవడం వంటివి చేస్తున్నారు.
అయితే, మూడో రోజు పాదయాత్రలో భాగంగా నారా లోకేశ్ మహిళలతో చిన్నపాటి సమావేశం అయ్యారు. అప్పుడే ఓ మహిళ చంద్రబాబుపై పాట పాడి తన అభిమానాన్ని చాటుకుంది. ‘‘జుం.. జుం.. తారారే.. నారాచంద్రన్న వచ్చాడు.. మన బాధలు చూశాడు..’’ అంటూ ఆమె పాట సాగింది. పాట పాడిన ప్రేమ అనే మహిళను నారా లోకేష్ అభినందించారు. ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు.
అనంతరం శాంతిపురంలో మహిళలతో నిర్వహించిన నారా లోకేష్ ముఖాముఖిలో వారు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు. పన్నులు విపరీతంగా పెంచి అమ్మ ఒడి ఇచ్చాం అంటున్నారని వాపోయారు. అమ్మ ఒడిలో అనేక సాకులు చెప్పి డబ్బులు కట్ చేసి ఇస్తున్నారని అన్నారు. ఈ ఏడాది అమ్మ ఒడి కూడా పడలేదని చెప్పారు. ‘‘నిత్యావసర సరుకుల ధరలు, గ్యాస్ ధర, కరెంట్ ఛార్జీలు, చెత్త పన్ను, ఇంటి పన్ను, బస్ ఛార్జీలు ఇలా మాపై ప్రభుత్వం విపరీతంగా భారాన్ని పెంచేసింది. వచ్చే అరకొర ఆదాయంతో బతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు లోకేష్ పాదయాత్రలో టాలీవుడ్ నటుడు తారకరత్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర గుండెపోటుకు గురైన నందమూరి తారకరత్నను పరామర్శించేందుకు జూనియర్ ఎన్టీఆర్ , లక్ష్మీప్రణతి, నందమూరి కల్యాణ్ రామ్ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి చేరుకున్నారు. విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ చలించిపోయారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kuppam, Local News