GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
ఈ రోజుల్లో సెల్ఫీ అంటే ప్రజల్లో వున్న పిచ్చి అంతా ఇంతా కాదు. ఎక్కడకు వెళ్లినా... ఏం చేసినా.., సెలబ్రీటిలు.., పొలిటీషియన్స్ తో ఇలా ఎవరు కనపడినా టక్కుటక్కున సెల్ఫీలను క్లిక్ మనిపిస్తుంది నేటి యువతరం. సెల్ఫీల వ్యామోహంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన ఓ యువకుడు మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించాడు. తాను తీసుకునే సెల్ఫీలతో సమాజంలో మార్పు కోసం ఉపయోగిస్తున్నాడు. నాడు.., నేడు అంటూ స్వచ్ఛ భారత్ కల సాకారం చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. ఆ ప్రయత్నంలో ప్రతిఫలంగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డును సొంతం చేసుకున్నాడో తెలుగు యువకుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన సీఎస్ చరిత్ కు చిన్నతనం నుంచి పరిసరాలను శుభ్రంగా ఉంచడమంటే చాలా ఇష్టం. 2014లో బీ.టెక్ పూర్తి చేసిన చరిత్.., ఆ తర్వాత బ్యాంకు ఉద్యోగం సంపాదించి తొలుత కేరళలోని ట్రావెంకోర్లోని ఎస్బీఐలో ఉద్యోగంలో చేరాడు.
ఉద్యోగం కోసం స్వస్థలం నుంచి కేరళకు రైలులోనే ప్రయాణించేవాడు. ఆ ప్రయాణంలో చరిత్ ఒక విషయం గమనించాడు. తన చిన్నతనంలో వున్న రైల్వే స్టేషన్లకు.., ఇప్పటికీ ఎంతో మార్పు చూశాడు. పరిశుభ్రతలో కొట్టొచ్చిన తేడా చరిత్ ను ఆకర్షించింది. అతి సుందరంగా కనిపించే ప్లాట్ఫామ్ ల పై చరిత్ ఆరా తీశాడు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్... రైల్వే స్టేషన్ల స్థితిగతులను మార్చిందని తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఉద్యోగ రిత్యా తాను సాగించే ప్రయాణ సమయంలో వెళ్లే ప్రతి స్టేషన్లో స్వచ్ఛతపై ఫోటోల సేకరణ ప్రారంభించాడు. తాను ప్రయాణించే మార్గంలో స్వచ్ఛమైన స్టేషన్లలో సెల్ఫీలు దిగి.., ఆ సెల్ఫీలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసేవాడు.
ఆయా స్టేషన్లలో ఊరిపేర్లకు సంబంధించిన బోర్డులతో కూడిన సెల్ఫీలు తసుకొని తన ఫేస్బుక్లో ప్రత్యేకంగా ఓ ఆల్బమ్ క్రియేట్ చేసి ఆ చిత్రాలను అక్కడ పోస్టు చేసేవాడు. సహోద్యోగులు ఇచ్చిన సలహాతో చరత్ సెల్ఫీ ఆల్బమ్ తన ఫేస్బుక్ నుంచి జాతీయ స్థాయి రికార్డుల బుక్లకు చేరింది. అరుదైన సెల్ఫీలుగా గుర్తించిన ఇండియా బుక్స్ ఆప్ రికార్డు సంస్థ 2019లో చరిత్ ను మెమొంటోతో సత్కరించగా వరల్డ్ రికార్డు ఆఫ్ యునివర్సీటి వారు డాక్టరేట్ తో గౌరవించారు. గిన్నిస్ బుక్లో స్థానం సాధించి స్వచ్ఛభారత్ సంకల్పాన్ని మరింత మందికి చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చరిత్ చెప్తున్నాడు.
ఇప్పటి వరకు అలా వృత్తి రీత్యా పది రాష్ట్రాలలో ప్రయాణించి తన ప్రయాణంలో వున్న పలు రైల్వే స్టేషన్ లలో 310 ఫోటోలను తీసి పెట్టాడు. చరిత్ ప్రస్తుతం తిరుమల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్ గా ఉద్యోగం నిర్వహిస్తున్నాడు. ఇదండీ మన స్వీయ సెల్ఫీ ఫోటోగ్రాఫర్ స్టేషన్లో ఫొటోలు తీసి స్వచ్చభారత్కు అనధికార అంబాసిడర్గా మారిన యువకుడి కథ...!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Swachh Bharat, Tirupati