Tirupati: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Lord Venkateswara Swamy) వెలిసిన తిరుమల (Tirumala) గిరులు భక్తి భావంతో మారుమోగుతున్నాయి. తాజాగా శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. తరువాత లక్ష్మణ సమేత సీతాశ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు ఊరేగింపుంగా తీసుకెళ్లారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, అగ్ని ప్రణణయం, కుంభారాధన, ఉక్తహోమాలు ఘనంగా జరిపారు. భక్తుల జైజై ధ్వానాల మధ్య.. ఉత్సవమూర్తులకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. ఆ వెంటనే యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి చేరుకున్నారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, భాష్యకార్లకు, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. పవిత్ర సమర్పణను కన్నులపండువగా నిర్వహించారు.
సోమవారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం ఉత్సవంలా సాగింది. ఆ తరువాత నుంచి భాష్యకార్ల సన్నిధి దగ్గర యిహల్ శాత్తుమొర నిర్వహించారు. రాత్రి ఆలయంలోని యాగశాలలో వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఓ వైపు గోవింద నామస్మరణ.. మరోవైపు జై శ్రీరామ్ అనే నినాదాలతో ఆలయప్రాంగణం మారుమోగోంది. సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవ ఊరేగింపు వైభవంగా సాగింది.
మరోవైపు తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ కొంత తగ్గింది. చాలా రోజుల తర్వాత భక్తుల రద్దీ కొంత తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు. చాలా రోజుల తరువాత భక్తులు ఆరు కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారని అధికారులు చెప్పారు. దర్శనానికి కేవలం ఆరు గంటల సమయం పడుతుందన్నారు. గత రెండు నెలల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్లు బయటకు కన్పించేవి. శ్రీవారి దర్శన సమయం కూడా పది గంటల సమయానికి పైగానే పట్టేది. కానీ సోమవారం కేవలం 6 గంటలంలోనే దర్శనం పూర్తి చేసుకున్నారు భక్తులు.
ఇదీ చదవండి : ఎత్తు మూడు అడుగులే.. కానీ కాసుల వర్షం కురిపించింది.. ఎందుకంత స్పెషలో తెలుసా..?
వారంతాల్లో భారీగానే భక్తులు కొండకు చేరుకున్నారు. ఒక్క ఆదివారమే శ్రీవారిని 80,815 మంది భక్తులు దర్శించుకున్నారు. 31,562 మంది భక్తులు తలనీలాలను సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. కానీ సోమవారం మాత్రం అనూహ్యంగా రద్దీ తగ్గింది. దీని ప్రధాన కారణం స్కూళ్లు ఓపెన్ అవ్వడం.. విద్యార్థులంతా ఇక చదువ్లలో బిజీ అవ్వడంతో.. తల్లిదండ్రుల రాక కూడా తిరుమలకు తగ్గిందని.. ఇకపై కేవలం వారంతాల్లోనే రద్దీ ఉండే అవకాశం ఉండొచ్చు అంటున్నారు అధికారులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Tirumala, Tirupati, Ttd