GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఇలా తిరుమలకు వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటుంటారు. నగదు, చిల్లరనాణెలు, బంగారం, వెండి వారి వారి స్థోమతను బట్టి కానుకల రూపంలో హుండీలో సమర్పిస్తారు. కొందరైతే నిలువుదోపిడీగా ఒంటిపై ఉన్న ఆభరణాలు అన్ని స్వామి వారికి సమర్పిస్తారు. అయితే ఇలా భక్తులు సమర్పించిన నగదులో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)వద్ద నిల్వచేసిన పాత నోట్లకు మోక్షం లభించేలా కనిపించడం లేదు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ను ఇప్పటికే ఈ విషయం నాలుగు సార్లు కలిసినా పాతనోట్లను తీసుకునేందుకు సిద్ధంగా లేమని చెప్పినట్లు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. అయితే భక్తుల మనోభావాలు, విశ్వాసాలకు ముడిపడిన అంశం కావడంతో భక్తులు స్వామివారికి సమర్పించిన పాత నోట్లను ఏం చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. అసలు టీటీడీ వద్ద ఎన్నిపాత నోట్లు ఉన్నాయా..? పాత నోట్లను రిజర్వ్ బ్యాంక్లో డిపాజిట్ చేసుకునేందుకు కేంద్ర సర్కార్ ఎందుకు వెనుకడుగు వేస్తోంది..? ఒక వేళ పాత నోట్ల డిపాజిట్లపై స్పష్టతరాని పక్షంలో ఆ పాత నోట్లను టీటీడీ ఏం చేయనుంది..?
2016 నవంబర్లో కేంద్ర ప్రభుత్వం రూ.500, వెయ్యి నోట్లను రద్దు చేసినప్పటికీ భక్తులు మాత్రం తమవద్ద ఉన్న పాత నోట్లను స్వామివారికి సమర్పిస్తూ వచ్చారు. అలా ఇప్పటి వరకు టీటీడీ వద్ద రూ.49.70 కోట్లు రద్దైన పాత నోట్ల నిల్వలు ఉన్నాయి. దీనిపై గత టీటీడీ తాజా మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి రెండేళ్లలో నాలుగు సార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ను కలిసి పాత నోట్ల డిపాజిట్ చేసుకోవాలని కోరారు. అయితే టీటీడీ వద్ద నిల్వ ఉన్న పాతనోట్లను రిజర్వ్ బ్యాంకులో గానీ, ఏ ఇతర బ్యాంకుల్లోనైనా డిపాజిట్ చేయడానికి అనుమతించాలని సుబ్బారెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం పాత నోట్లను రద్దుచేసిన నాటి నుంచి టీటీడీ నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి అనేక ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు ఆ తరువాత కూడా స్వామివారికి హుండీ ద్వారా రద్దు అయిన నోట్లు కానుకగా సమర్పిస్తూ వచ్చారు. భక్తుల మనోభావాలతో ముడిపడిన సున్నితమైన అంశం కావడంతో భక్తులు ఈ నోట్లను హుండీలో సమర్పించకుండా నిరోధించే ఏర్పాట్లు టీటీడీ చేయలేకపోయింది. ఈ రకంగా భక్తుల నుండి 1.8 లక్షల రూ.వెయ్యి నోట్లు, 6.34 లక్షల రూ.500 నోట్లు కానుకలుగా వచ్చాయి.
అనేక బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతున్న టీటీడీ హుండీ ద్వారా లభించే కానుకలకు పాతనోట్ల మార్పిడి అంశానికి సంబంధించి 2017 నుంచి టీటీడీ అనేకసార్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాసి విజ్ఞప్తి చేసినా సానుకూల స్పందన రాలేదు. ఐతే టీటీడీ వద్ద ఉన్న పాతనోట్లను డిపాజిట్ చేసుకుంటే ఇతర సంస్థలు, దేవాలయాల ట్రస్టుల నుండి కూడా ఒత్తిళ్లు వస్తాయని నిర్మలా సీతారామన్ చెప్పినట్లు వై.వీ సుబ్బారెడ్డి చివరి పాలకమండలి సమావేశంలో వెల్లడించారు.
దేశంలోని ఇతర దేవాలయాలు, ధార్మిక సంస్థల వద్ద టీటీడీ మాదిరిగానే పాతనోట్ల నిల్వ ఉన్న నేపథ్యంలో కేంద్రం టీటీడీ వద్ద ఉన్న పాతనోట్లను డిపాజిట్ చేసుకునేందుకు సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో టీటీడీ ఆ పాతనోట్లను నిర్వీర్యం చేయడానికి కూడా వెనకడుగు వేస్తోంది. భక్తుకు ఎంతో భక్తి శ్రద్దలతో సమర్పించిన కానుకలు కావంతో వారి మనోభావాలు, విశ్వాసాలకు సంబంధించిన అంశం ముడిపడి ఉంది. ఇదే సమయంలో డబ్బుకు ఆధ్యాత్మిక విలువ ఉండటంతో వాటిని డిస్పోస్ చేయలేని పరిస్థతి టీటీడీధీ. పాతనోట్లను ప్రస్తుతం టీటీడీ ట్రజెరీలో భద్రపరచి ఉంచారు. కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎక్కువరోజులు పాతనోట్లను పెట్టుకోలేమని తెలిపారు అధికారులు. పాతనోట్లపై కేంద్రం తేల్చకుంటే రూ.49.70కోట్ల పాత కరెన్సీని నిర్వీర్యం చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Currency, Rbi, Ttd news