TIRUPATI TIRUMALA TIRUPATI DEVASTHANAM NEWS BOARD DECISIONS ARE MORE CONTROVERSY THATS WHY THEY TAKE BACK STEPS NGS
TTD Decisions: వివాదాస్పదమవుతున్న పాలకమండలి నిర్ణయాలు.. హడావుడి చేసి తరువాత టీటీడీ యూటర్న్
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (ఫైల్)
TTD Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తీరు నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల కాలంలో టీటీడీ నిర్ణయాలు రచ్చ రచ్చ అవుతున్నాయి. తాజాగా ఆర్జిత సేవా టికెట్ల రేట్ల పెంపు.. హోటళ్ల మూసి వేత కూడా ఆ కోవలోకే చేరాయి. టీటీడీ నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదం అవుతుండడంతో వెంటనే మళ్లీ యూటర్న్ తీసుకుంటున్నారు.
TTD Decisions: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tiruapti Devasthanam) పాలకమండలి ఏ నిర్ణయం తీసుకున్న అది వివాదంగా మారుతోంది. మొదట వెనక్కు తగ్గేదే లేదని.. తమ నిర్ణయమే ఫైనల్ అని చెబుతూ వస్తున్న.. టీటీడీ కొన్ని రోజుల తరువాత మళ్లీ యూటర్న్ అంటోంది. దీంతో టీటీడీ (TTD) తీవ్ర విమర్శలపాలవుతోంది. అందుకు ప్రధాన కారణం.. సాధ్యాసాధ్యాలను పరిశిలించకపోవడం.. కంగారుగా నిర్ణయాలు తీసుకోవడం.. ప్రభుత్వానికి అప్రతిష్ట తీసుకురావడం.. చివరికి వెనక్కి తగ్గడం ఆనవాయితీగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ జాబితాలో శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపు, హోటళ్ల మూసివేత అంశం కూడా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలకు పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తారు. వాటికి హజరైన భక్తులు స్వామివారికి బలంగానే హుండీలో కానుకలు సమర్పిస్తారు. సుప్రభాత సేవ మొదలుకోని.. వీఐపీ బ్రేక్ దర్శనం సమయానికే మూడో వంతు హుండీ ఆదాయం లభిస్తుంది. అందుకే ఆర్జిత సేవల టికెట్స్ రేట్లను ఆర్థికపరమైన అంశంగా టీటీడీ (TTD) ఎప్పుడూ చూడదు. పైపెచ్చు పరిమిత సంఖ్యలో జారీ చేసే ఆర్జిత సేవా టికెట్ల ధరల పెంపుతో ఆలయానికి వచ్చే ఆదాయం కన్నా.. ప్రభుత్వానికి వచ్చే అప్రతిష్టే ఎక్కువ అవుతోంది. దీంతో ఈ అంశాన్ని ఎవరూ టచ్ చేసేందుకు సాహసించరు.
గత ప్రభుత్వ హయంలో కూడా ఇలాంటి ప్రయత్నమే అప్పటి పాలకమండలి చేసింది. ధరల పెంపు కోసం సబ్కమిటీని నెలకొల్పారు. ఆ కమిటీ ప్రతిపాదించిన ధరలు పాలకమండలి సమావేశం రోజున బయటకు పొక్కడంతో రచ్చ మొదలైంది. ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోక తప్పలేదు. దాంతో పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఆ అంశాన్ని పక్కన పెట్టేసింది. తాజా పాలకమండలి సైతం ఆర్జిత సేవల ధరలు పెంచడం లేదని వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
శ్రీవారి ఆలయంలో రెండేళ్లుగా భక్తులను ఆర్జిత సేవలకు అనుమతించడం లేదు. దర్శనానికి కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం కల్పిస్తున్నారు. గత పాలకమండలి సమావేశంలో టెబుల్ అజెండాగా ఆర్జిత సేవల టికెట్ల ధరల పెంపుపై చర్చ చేపట్టారు. సామాన్య భక్తులకు ధరలు పెంచబోమంటూనే.. సిఫారసు లేఖలపై కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల రేట్లను పదింతలు పెంచుతూ ప్రతిపాదన చేశారు. దీనిపై భక్తులు మండిపడ్డారు. ఆర్జిత సేవా టికెట్స్ సామాన్యులకు అందుబాటులో లేకుండా చేశారని విమర్శలు వచ్చాయి. అసలు సిఫారసు లేఖలు ద్వారా సామాన్య భక్తులు ఆర్జిత సేవలు పొందరా అనే ప్రశ్నలు వచ్చాయి. ప్రజాప్రతినిధులతోపాటు పాలకమండలి సభ్యులు సిఫారసు లేఖలు ఇస్తారు. ఆ లేఖలను సంపన్నులతోపాటు సామాన్యులకు కూడా ఇస్తుంటారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ విమర్శలు రావడంతో ప్రజాప్రతినిధులకు ఇబ్బందిగా మారింది. పాలకమండలిలో చర్చ కూడా రచ్చరచ్చ కావడంతో ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాల్సి వచ్చినట్టు టాక్.
తాజాగా వివాదాస్పద అంశాలకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రభుత్వం పెద్దలు అక్షింతలు పెట్టినట్టు టాక్.. దీంతో దానిపై నిర్ణయం తీసుకోలేదు. అలాంటి ఆలోచనే లేదని పాలకమండలి పెద్దలు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది. మరోవైపు తిరుమలలో హోటళ్లు మూసివేస్తున్నట్టు మొదట అధికారులు చెబుతూ వచ్చారు. ఇది కూడా పెను వివాదంగా మారింది. తిరుమల కొండపై ఉండే వ్యాపారులంతా టీటీడీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు.. ఇంతకాలం స్వామినే నమ్ముకుని జీవిస్తున్న తమ పరిస్థితి ఏంటి అని నిలదీశారు. ఈ వ్యాపారం తప్ప మరో విధంగా తమకు జీవించడం రాదని మొర పెట్టాకున్నారు. దీనిపై ఉద్యమం చేయాలని కూడా నిర్ణయించారు.. ఊహించని స్థాయిలో వ్యతిరేకత రావడంతో.. ఈ విషయంలోనూ పాలకమండలి కాస్త వెనుక అడుగు వేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.