GT Hemanth Kumar, News18, Tirupati
రాతియుగం నుంచి యాత్రిక యుగంలో ఒక్కో అడుగు... టెరాబైట్... జీగాబైట్ అంటూ వేస్తున్న తరుణంలో కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. మనకు కనిపించే కొన్ని సన్నివేశాలు అసలు మనం ఉన్న యుగం ఏంటో అని ఆలోచిస్తాం. మనిషి పుట్టిన నాటి నుంచి చనిపోయే వరకు ఎన్నో వింత పరిస్థితులు.., వింత అనుభవాలకు లోనవక తప్పదు. శిశువు జన్మిస్తే ఇంటికి.. ఇంట్లో వ్యక్తులు మరణిస్తే కాటికి వెళ్లాల్సిందే. కానీ ఓ గ్రామంలో మాత్రం వింత ఆచారన్ని పాటిస్తున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే వాకిట్లోనే అంత్యక్రియలు చేయాల్సిన పరిస్థితి.. ప్రతి గుమ్మ ముందు తులసికోటకు బదులు సమాధి ఉందుంటే నమ్ముతారా..? అసలు వారికి ఈ పరిస్థితి ఎందుకొచ్చింది.. వాకిలే వల్లకాడుగా ఎందుకు మారింది..?
ప్రముఖ ఆధ్యాత్మిక నగరి తిరుపతి (Tirupati) సమీపంలోని కారకంబాడి తిమ్మనాయిడుపాళ్యం హరిజనవాడ ఉంది. తిమ్మనాయుడు పాళ్యం ఎస్సీకాలనీ, బంగారమ్మ కాలనీల 1984లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 61 కుటుంబాలతో టీఎన్ హరిజనవాడగా ప్రభుత్వం పక్కా ఇళ్లను నిర్మించింది. క్రమంగా ఇక్కడ జనాభా పెరుగుతుండటంతో పక్కనే బంగారమ్మ కాలనీ కూడా నిర్మించింది. గ్రామానికి అన్నీ ఉన్నా శ్మశాన వాటిక లేకపోవడంతో స్థానికులంతా కలిసి ప్రైవేట్ భూమిని అద్దెకు తీసుకున్నారు. ఐతే 20 ఏళ్ల క్రితం సదరు స్థలాన్ని యజమానులు స్వాధీనం చేసుకొని ప్లాట్లు వేసి అమ్మేశారు. దీంతో టీఎన్ హరిజనవాడకు స్మశానం లేకుండా పోయింది. రాజకీయ నాయకుల నుంచి అధికారుల వరకు గ్రామస్థులు ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.
ఇది చదవండి: చనిపోయిందనుకొని పోస్ట్ మార్టంకు తీసుకెంళ్తుంటే షాకింగ్ సీన్..
ఇక స్మశానవాటిక వచ్చేది కలే అని భావించిన గ్రామస్తులు కొన్నాళ్లు మృతదేహాలను తిరుపతిలో ఖననం చేస్తూ వచ్చారు. పల్లె నుంచి తిరుపతికి పడే మోసుకుంటూ.., లేదా అంతిమయాత్ర రథంతో రావాలంటే శ్రమ, డబ్బుతో కూడుకున్న పని. దీంతో స్థోమత లేని పల్లెవాసులు దిక్కుతోచని స్థితిలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇంట్లో ఎవరైనా చనిపోతే వాకిట్లోనే ఖననం చేయడం ప్రారంబించారు. ఐతే ఇలాంటి సమయాల్లో ఇరుగుపొరుగు వారితో గొడవలు జరిగి కొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
గ్రామానికి స్మశాన వాటిక లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీఎన్ పల్లె వాసులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. స్మశానం లేని కారణంగా ఇళ్ల మధ్యలోనే మృతదేహాలని పూడ్చి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇళ్ల వద్దనే 20 అంత్యక్రియలు నిర్వహించారట. ఇళ్ల మధ్యలో ఖననం చేయడం ద్వారా ఇరుగు పొరుగు మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు. రాజకీయ నాయకులు, అధికారులు తమ ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమ గోడును పట్టించుకోవాలని వేడుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati