GT Hemanth Kumarn, Tirupathi, News18
పల్లెలు అంటేనే ఆహ్లాదకరమైన కరమైన వాతావరణం ఉంటుంది. ఎటు చూసిన చల్లని గాలులు... పచ్చని పొలాలు కళ్ళకు కనువిందు చేస్తుంటాయి. అమాయకమైన జనం, ఆహ్లాదాన్ని పంచేవాతావరణంతో అలరారే పల్లెల్లో సౌకర్యాలు కరువవుతున్నాయి. అసలే పల్లెలు. పట్టణాల్లో ఉండే అధునాతన సౌకర్యాలు అందుబాటులో ఉండకపోవచ్చు.. కానీ కనీస వసతులైన కల్పించాల్సిన అవసరముంది. ఆ అరకొర సౌకర్యాలు కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల తుడిచిపెట్టుకుపోతే స్థానికుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లాలోని (Chittoor District) కొన్ని పల్లెలలు రాకపోకలు సాగించాలంటే కష్టంగా మారుతోంది. పల్లె నుంచి బయటకు వెళ్లాలంటేనే స్థానికులు భయాందోళనకు గురి అవుతున్న పరిస్థితి. ఇక విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాలంటే తల్లితండ్రులు తోడు వెళ్లాల్సిందే..! అత్యవసర వైద్యానికి వెళ్లాలంటే ప్రాణాలు గాల్లో కలసిపోవాల్సిందే..!
ఏడాది క్రితం వచ్చిన నివర్ తుఫాన్ (Cyclone Nivar) ఆ పల్లెలకలు తీరని తిప్పలను తెచ్చిపెట్టింది. ఏడాదిగా ఎంతో మంది నాయకులను, అధికారులను కలసినా వారి సమస్య మాత్రం తీరడం లేదు. గతేడాది పల్లెలపై విజృంభించిన నివర్... కొన్ని పల్లెలకు మార్గంగా ఉన్న ఆయకట్టు పూర్తిగా ద్వంసం కావడంతో వారి కష్టాలు వర్ణనాతీతంగా మారింది.
వివరాల్లోకి వెళితే.., చిత్తూరు జిల్లా సోమల మండలంలోని పొదలకుంటపల్లి పంచాయతీలోని కొన్ని గ్రామాలూ రోజు వాగు దాటేందుకు కష్టపడాల్సి వస్తోంది. ముఖ్యంగా తూగడంవారిపల్లి, ఎమ్.వడ్డిపల్లి, సి.వడ్డిపల్లి, తిమ్మ నాయనపల్లి గ్రామాలకు ఇతర గ్రామాల నుండి రావడానికి ప్రధాన ఆనకట్ట ఉండేది. ఈ ఆనకట్ట ద్వారా నిత్యం రాకపోకలు జరిపే వారు ఆ గ్రామాల ప్రజలు. గతేడాది నివర్ తుఫాన్ చిత్తూరు జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి.
పుంగనూరులో కురిసిన భారీ వర్షాలకు ఆనకట్ట కొట్టుకు పోయింది. అప్పటి నుంచి ఆయా గ్రామాలకు వెళ్లేందుకు దారిలేకుండా పోయింది. స్థానికులు నిత్యావసరాలు తెచ్చుకునేందుకు, పిల్లలు స్కూల్ కు వెళ్లేందుకు, ఆస్పత్రులకు, ఇతర అవసరాలకు వెళ్లాలంటే ఈ దారే ఆధారం. విద్యార్థులు నీటి ప్రవాహాన్ని దాటుకుంటూ స్కూలుకు వెళ్లాల్సిన పరిస్థితి.
ఇది చదవండి: జీవీఎంసీ కమిషనర్ బదిలీ వెనుక రాజకీయహస్తం..? అందుకే పంపించేశారా..?
ఇదే నీటి ప్రవాహంలో నంజంపేటకు చెందిన వినోద్ కుమార్ అనే యువకుడు అతని మిత్రులను కలవడానికి వడ్డేపల్లికి వచ్చి తిరుగు ప్రయాణంలో దళవాయి చెరువు దాటుతుండగా వరద వేగానికి కొట్టుకుపోయి మృతి చెందాడు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మా పరిస్థితి ఏంటంటూ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆనకట్ట నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Cyclone Nivar