రాష్ట్రాల సరిహద్దుల్లో నిత్యం వాహనాల తనిఖీలు జరుగుతూనే ఉంటాయి. ఎలాంటి అనుమానాస్పద వాహనాలుగానీ, వస్తువులుగానీ కనిపిస్తే పోలీసులు సీజ్ చేస్తారు. అక్రమంగా ఏమైనా తరలిస్తే వారిని అరెస్ట్ చేస్తారు. ఇది ప్రతిరోజూ జరిగే ప్రక్రియే. కానీ ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక సరిహద్దు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు షాకింగ్ సీన్ ఎదురైంది. ఓ కారును తనిఖీ చేస్తుంటగా అందులో మూటల కొద్దీ డబ్బు పట్టుబడింది. ఆ డబ్బుపై ఆరా తీసిన పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలం, గండ్రాజుపల్లె వద్ద ఉన్న అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న సందర్భంగా బెంగుళూరు నుండి చిత్తూరు వైపు వెళ్తున్న ఓ కారులోని రెండు బ్యాగుల్లో నోట్ల కట్టలు దొరికాయి. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేషన్ కు తరలించి విచారించారపు. తాము పశ్చిమ బెంగాల్ కు చెందిన సుబంకర్ షిల్, రాజు దేవనాథ్ గా నిందితులు తెలిపారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా తెచ్చారనే కోణంలో పోలీసులు వారిని లోతుగా విచారించగా అసలు నిజం చెప్పారు.
ఈ నెల 2వ తేదీన వారు తమ స్నేహితుడు సంజు సాహుతో కలిసి బెంగుళూరులోని MHR లేవుట్ ప్రాంతంలో తాళాలు వేసిన ఓ ఇంటిని పగులగొట్టి అల్మారాలోని 90 లక్షల నగదు దొంగిలించినట్లు తెలిపారు. బెంగళూరు నుంచి ట్యాక్సీ మాట్లాడుకొని.. డబ్బును బెంగాల్ కు తీసుకెళ్తుంగా మార్గమధ్యలో పట్టుబడ్డారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు.. బెంగళూరులోని ఇంటి యజమానికి సమాచారం ఇచ్చి దొంగతనం జరిగినట్లు నిర్ధారించారు.
ఏకంగా కోటి రూపాయలు దోచేసిన దొంగలు..దర్జాగా కారు మాట్లాడుకొని బెంగాల్ కు పారిపోదామని ప్లాన్ వేశారు. ఐతే ఇంతలోనే పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. చేసిన పాపం ఎక్కడికెళ్లినా వెంటాడుతుంటే ఇదేనేమో..? బెంగళూరులోని ఓ ఖరీదైన ఏరియాలో భారీ మొత్తంలో డబ్బులు కొట్టేసినా.. చిన్న పల్లెటూరులో పోలీసులకు దొరికిపోవడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police