ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రతిపక్ష నేత, టీడీపీ (TDP) చీఫ్ నారా చంద్రబాబు నాయుడు (Nara Chandra Babu Naidu) చిత్తూరు జిల్లా (Chittoor District) కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా సీఎం జగన్ పై, ప్రభుత్వ విధానాలపై ఆయన విమర్శలు సంధిస్తున్నారు. శనివారం గుడిపల్లి మండలం జాతకర్తనపల్లిలో రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రామం తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా ఉండటంతో స్థానికులంతా తమిళంలోనే మాట్లాడతారు. దీంతో చంద్రబాబు కూడా వారిని “ఎల్లాం నల్లా ఇరుక్కణం” అంటూ తమిళంలోనే పలుకరించారు. ఈసారి వచ్చేటపుడు తమిళం బాగా నేర్చుకుని మాట్లాడుతానని ఆయన అన్నారు. అంతకుముందు ఆయన.. స్థానిక మునీశ్వరుని దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
యువతకు ఉపాధి, జాబ్ క్యాలెండర్, మద్యం విధానం, సిమెంట్ ధరలపై చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు చేసారు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి పులివెందుల్లో చేపల మార్కెట్, అక్కడక్కడా మటన్ మార్కెట్లను పెట్టి ఉద్యోగాలు ఇచ్చారన్నారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఇదే జగన్ జాబ్ చార్ట్ అని విమర్శించారు. అలాగే సీఎం తన సొంత బ్రాండ్లతో మద్యం పెట్టి ఆర్జిస్తున్నారని మండిపడ్డారు.భారతి సిమెంట్ ధరలు పెంచి లాభాలు ఆర్జిస్తూ, రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వైసీపీ పతనం మొదలైందని, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీ ఓటమి తథ్యమని చంద్రబాబు జోస్యం చెప్పారు. సీఎం జగన్ జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారని ఆరోపించారు. ఈ సీఎం.. పేదల ద్రోహిగా నిలిచిన సీఏం అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమని.. తానే సీఎం అవుతానని ధీమా వ్యక్తం చేశారు.
తన సభలకు వెళ్లొద్దంటూ స్థానిక నేతలు వాలంటీర్ల ద్వారా ప్రజలను భయపెట్టారని.. అయినా రెట్టించిన ఉత్సాహంతో యువత తరలివచ్చారని బాబు అన్నారు. ఎవరో ఇచ్చే పథకాలకు తన స్టిక్కర్ వేసే స్టిక్కర్ సీఎం జగన్ అని ఆయన ఎద్దేవా చేశారు. పీఎం కిసాన్ పథకం కింద ఇచ్చిన నిధులకు మీరు స్టిక్కర్ వేసుకోవడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. తన బటన్ తానే నొక్కుతున్నారంటూ జోకులు పేల్చారు. పాలించేవారు బాగా లేకనే రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని మండిపడ్డారు. ఇక్కడ అక్రమ, దొంగ క్వారీల వల్ల రోడ్లన్నీ ధ్వంసం అవుతున్నాయని.., తాము అధికారంలోకి రాగానే వాటిపై చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
శనివారం ఉదయం కుప్పంలో రోడ్ షో నిర్వహించిన బాబు... రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చేస్తుంటే ఆందోళన కలుగుతోందన్నారు. వేధింపులు భరించలేక ఎస్సీ యువకులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. ఎస్సీ యువకుడు మాస్క్ పెట్టుకోలేదని కొట్టిచంపారని.. సీఎం మాత్రం మాస్క్ పెట్టుకోరని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఉరుకోమని హెచ్చరించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Chandrababu Naidu, Kuppam