ఏపీలో దేవాలయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ అర్చకులు రమణ దీక్షితులు. తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు (Ramana Dikshitulu) ఏపీలోని ఆలయాల్లో ఆగమ శాస్త్రాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారంటూ ట్వీట్ చేశారు. ఏపీలో ఆలయాల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన తప్పుబట్టారు. ఆలయ అధికారులు సొంత ప్రణాళికలను అమలు చేస్తున్నారని విమర్శించారు. దేవాలయాల్లో రాజకీయ ప్రముఖులు, వ్యాపార వేత్తలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ట్విట్టర్లో రమణ దీక్షితులు ఆరోపించారు. ధనవంతులైన భక్తులకు టీటీడీ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని రమణదీక్షితులు ట్వీట్ చేశారు. వీఐపీల సేవలో తరిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితులు ఏపీలోనే చూస్తామని అసంతృప్తి వ్యక్తం చేశారు.
రమణ దీక్షితులు గతంలో కూడా ఘాటైన విమర్శలు, ట్వీట్లు చేశారు. టీటీడీలోని బ్రాహ్మణ వ్యతిరేకులు... టీటీడీలోని అర్చక వ్యవస్థను.. ఆలయ విధానాలను నాశనం చేసే లోపే తగిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాం’’ అని రమణ దీక్షితులు పేర్కొన్నారు. అలాగే తిరుమలలో జరుగుతున్న అవినీతిపై కూడా ఘాటు విమర్శలు చేశారు. ‘‘శ్రీవారి ఆలయంలో వివిధ కులాలకు చెందిన 54 కుటుంబాలు వంశపార్యపరంగా సేవలు చేస్తున్నాయి. 30/87 యాక్ట్ తో వీరిని తొలగించారు. ప్రస్తుతం తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది’’ అంటూ రమణదీక్షితులు ట్వీట్ చేశారు.
ఓ సందర్భాల్లో రమణ దీక్షితులు మాట్లాడుతూ.. వార్తాల్లో నిలిచారు. టీటీడీ (TTD) నిర్ణయాలను కూడా అనేక సందర్భాల్లో ఆయన తప్పుబట్టారు. సీఎం జగన్ (CM Jagan) విష్ణుమూర్తి ప్రతిరూపంగా రమణదీక్షితులు గతంలో అభివర్ణించారు. సనాతన ధర్మం అంతమవుతున్న దశలో విష్ణుమూర్తిలా జగన్ ధర్మాన్ని రక్షిస్తున్నారన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టవస్త్రాలు సమర్పించేందుకు జగన్ తిరుమల వచ్చారు. అయితే వన్ మ్యాన్ కమిటీ రిపోర్ట్ అమలుపై జగన్, ప్రకటన చేస్తారని ఆయన భావించారు. కానీ జగన్ మాత్రం శ్రీవారిని దర్శించుకుని ఎలాంటి ప్రకటనా చేయకుండా వెళ్లిపోయారు. దీంతో నిరాశ చెందిన రమణ దీక్షితులు ట్విట్టర్ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ట్విట్టర్ (Twitter)లో సీఎం జగన్ను ట్యాగ్ చేసి ప్రభుత్వంపై రమణ దీక్షితులు తీవ్ర అసహనాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Local News, Ramana dikshithulu