దేశంలో రైలు ప్రయాణాలు చాలా ముఖ్యం. దూర ప్రాంతాలకు వెళ్లాలనేవారికి ట్రైన్ బెస్ట్ ఆప్షన్. ఫ్యామిలీతో సహా ప్రయాణించడానికి ట్రైన్లు చాలా సేఫ్. ఐతే రైలు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా తృటిలో ప్రాణాలమీదికి వస్తుంది. ట్రైన్లో నిద్రపోయిన ఓ మహిళ.. గమ్యస్థానం చేరే సమయంలో మెళకువ రాలేదు. దీంతో ట్రైన్ కదిలే సమయానికి ఆమె నిద్రలేచింది. ఆ కంగారులో ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో అదుపుతప్పి ట్రైన్ కింద పడబోయింది. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి ఆమెను కాపాడాడు. దీంతో సదరు మహిళ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. తిరుమల శ్రీవారి దర్శనం కోసం విశాఖపట్నం నుంచి తిరుపతి వచ్చిన ఓ మహిళ.. రాత్రి నిద్రపోవడంతో స్టేషన్ రాగానే దిగలేకపోయింది. ఉదయం 4.30 గంటల సమయంలో రైలు తిరుపతి స్టేషన్ నుంచి కదులుతుండగా ఆమెకు మెలకువ వచ్చింది. దీంతో కంగారుగా ట్రైన్ నుంచి దూకేసింది.
రైలు వేగం పుంజుకోవడంతో అదుపుతప్పి పడిపోయింది. ట్రైన్ కిందకు పడబోయిన మహిళను రైల్వే కానిస్టేబుల్ సతీష్ రక్షించాడు. ఆమె పడిపోతుండగా.. ఒక్కసారిగా ముందుకు ఉరికి ఆమెను పట్టుకున్నాడు. తిరుపతిలో ట్రైన్ 10 నిముషాలపాటు ఆగినా నిద్ర నుంచి లేవకపోవడంతో ఘటన జరిగింది.
ఐతే ఆమెకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో బంధువులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఫ్లాట్ ఫారంపై ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ను ఉన్నతాధికారులు అభినందించారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు చాలానే చోటు చేసుకోగా.. రైల్వే పోలీసులు ప్రాణాలకు తెగించి కాపాడిన సందర్భాలున్నాయి. ఇటీవల ఓ రైల్వే స్టేషన్ లో ఓ చిన్నపిల్లాడు రైలు పట్టాలపై పడిపోగా.. ట్రైన్ కు ఎదురుగా పరుగెత్తుకుంటూ వేళ్లిన కానిస్టేబుల్ ప్రాణాలకు తెగించి రక్షించాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati, Train