ప్రస్తుతం ఏ నిత్యావసరాలు కొందామన్నా కల్తీ భయం అందర్నీ వెంటాడుతోంది. బియ్యం నుంచి పెట్రోల్ వరకు అన్నింట్లోనూ కల్తీ మాయ కనిపిస్తోంది. ఐతే సహజ సిద్ధంగా వచ్చే పదార్ధాలు కూడా కల్తీకి గురికావడం ఆందోళన కలిగిస్తోంది. బియ్యం, పంచదార, కారం, మసాలాలు, సగ్గుబియ్యం, గోధుమ పిండి, నూనెలు, నెయ్యి ఇలా అన్నింట్లోనూ కల్తీనే. ఇప్పుడు ఏపీలో నకిలీ కోడిగుడ్లు కలకలం రేపుతున్నాయి. అవి ప్లాస్టిక్ గుడ్లంటూ ప్రచారం సుగుతోంది. మామూలు కోడిగుడ్డుకంటే భిన్నంగా ఉండటం, ఉడకకపోవడం, పగలకపోవడంతో మహిళలు బెంబేలెత్తిపోయే పరిస్థితి. వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో ప్లాస్టిక్ గుడ్ల కలకలం రేగింది. అండ్రవారిపల్లిలో ఆటోలో వచ్చిన కొందరు వ్యాపారులు 30 కోడిగుడ్లను రూ.100, 130కి విక్రయించారు. బయటి మార్కెట్లో కంటే తక్కువ ధరకు గుడ్లు వస్తుండటంతో స్థానికులు ఎగబడి కొన్నారు. ఎప్పటిలాగానే ఎగ్ కర్రీ చేసేందుకు గుడ్లను ఉడకబెట్టారు.
ఇదిలా ఉంటే ఇటీవలే నెల్లూరు జిల్లాలో ప్లాస్టిక్ రైస్ కలకలం రేగింది. ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ రైస్ రావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. అటు విశాఖపట్నం జిల్లాలోనూ వారం క్రితం ఇదే రకమైన ఘటన చోటు చేసుకుంది. గిరిజన సహకార సంస్థ ద్వారా ఏజెన్సీలోని గిరిజనులకు సరఫరా చేసిన బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కనిపించడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. ప్లాస్టిక్ బియ్యం ఇస్తే తాము ఏం తినాలని ప్రశ్నించారు. గతంలో గోధుమ పిండిలోనూ ప్లాస్టిక్ దర్శనమిచ్చిన ఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Eggs, Nellore Dist