GT Hemanth Kumar, News18, Tirupati
ఒకప్పుడు ఎన్ఆర్ఐ (NRI) సంబంధాలు అంటే ఒకింత భయం వేసేది. తమ బిడ్డను చేసుకున్న భర్త ఎలా చేసుకుంటాడో అనే ఆవేదన కుటుంబ సభ్యులు నెలకొనేది. కొన్నాళ్లకు ఆ అభిప్రాయం మారి ఏన్ఆర్ఐ సంబంధం అంటే ఎగిరి గంతులు వేసే రోజులు వచ్చాయి. అమెరికా (America), ఆస్ట్రేలియా (Australia), యూకే (UK), అరబ్ దేశాల్లో కొలువు చేస్తున్న ఎన్ఆర్ఐ సంబంధాల కోసం వెతుకుతుంటారు కుటుంబ సభ్యులు. కానీ కొందరు ఎన్ఆర్ఐల నిర్వాకం మాత్రం ఆందోళన కలిగిస్తూనే ఉంటుంది. దాంపత్య జీవితాన్ని డబ్బులతో ముడిపెట్టి.. కట్టుకున్న భార్యను ఇండియాకు పంపిస్తున్న సంఘటనలు ఎన్నో. ఇలా తమ భార్య పిల్లలను ఇండియా కు పంపేసి.. మరో పెళ్ళికి రెడీ అయ్యాడు ఓ ఎన్ఆర్ఐ. విషయం తెలుసుకున్న భార్య., అత్తారింటికి వెళ్తే అత్తమామలు పరార్.
వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తిరుపతి (Tirupati) రూరల్ మండలం తుమ్మగుంటలో నివాసం ఉంటున్న కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజ దంపతులకు సిద్దేశ్వర ప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న సిద్దేశ్వర్ ప్రసాద్ కు గూడూరుకు చెందిన ఓలేటి సోనీతో 2014లో పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం భార్య సోనీని అమెరికాకు తీసుకెళ్లాడు సిద్దేశ్వర్. కొన్నాళ్లు బాగానే కాపురం సాగింది. కలసి మెలసి బాగా జీవిస్తూ ఉండేవారు. అయితే 2015లో మగబిడ్డకు జన్మనిచ్చింది సోనీ. అనంతరం సోనీని అమ్మగారి ఇంటికి పంపాడు. ఇండియాకి వచ్చిన కొన్నాళ్లు భార్యతో బాగానే మాట్లాడిన సిద్ధేశ్వర్ ఆ తర్వాత క్రమంగా భార్యతో మాట్లాడటం మానేశాడు.
ఇది చదవండి: ప్రియుడుతో కలిసి భర్త హత్య.., కొడుకుతో కలిసి స్కెచ్.. చివరికి అడ్డంగా దొరికిపోయింది..
కొన్ని నేలల తర్వాత అనంతరం అదనపు కట్నం కావాలని సోనీని కోరాడు. దీంతో పెళ్లి సమయంలో కేజీ బంగారం, 10 కేజీల వెండి, 12 లక్షల నగదు కట్నం ఇచ్చారని.., 50 లక్షలు పెట్టి పెళ్లిని వైభవంగా చేసినా మళ్లీ ఎలా కట్నం అడగమంటావ్ అని సోనీ ఎదురు తిరిగింది. ఆ నాటి నుంచి మొబైల్ నెంబర్ మార్చేసి భార్యతో అసలు మాట్లాడటం మానేశాడు. అప్పటినుంచి ఇప్పటి వరకు భర్త కోసం ఎదురు చూస్తున్న సోనీకి షాకింగ్ విషయం తెలిసింది.
భర్త సిద్దేశ్వర్ వేరొక యువతితో వివాహానికిసిద్ధం అయినట్లు బంధువుల వద్ద నుంచి సమాచారం అందుంకుంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది సోనీ. భర్త, అత్తమామల నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో నేరుగా అత్తగారింటికి వచ్చింది. విషయం తెలుసుకున్న కొమ్మినేని లోకయ్య నాయుడు, పద్మజ అప్పటికే పరారయ్యారు. దీంతో సోనీ అక్కడే ఆందోళనకు దిగింది. తన భర్త వచ్చే నెల 21న వేరే యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడని.. తనకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటోంది. అమెరికాలో మంచి ఉద్యోగం అని కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తే ఇంత అన్యాయం చేస్తాడనుకోలేదని సోని తల్లిదండ్రులు వాపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Tirupati