GT Hemanth Kumar, News18, Tirupati
తల్లితండ్రులు ప్రత్యక్ష దైవంగా హైందవ మత పురాణాలూ., గ్రంధాలూ చెపుతుంటాయి. తల్లితండ్రుల సేవే పరమాత్ముని సేవగా భావించాలని చెప్తారు పెద్దలు. తల్లితో ఆ కుమారుడి ఒక్క ప్రశ్న తన గమ్యాన్నే మర్చి వేసింది. నవమాసాలు మోసి.. జన్మనిచ్చిన ఆ మాతృ మూర్తి ఋణం తీర్చుకొనేందుకు ఇంతకన్నా గొప్ప అవకాశం రాదని అనుకున్నాడు. సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రం దర్శించలేని ఆ మాతృ మూర్తికి దేశంలోని అన్ని దేవాలయాలు చూపించాలని సంకల్పించాడు. నాలుగు గోడల మధ్య నుంచి తల్లికి విముక్తి కలిగించి అందమైన లోకాన్ని చూపిస్తున్నాడు. బస్సులోనో.. రైలులోనో.. కారులోనో కాకుండా.. తన తండ్రి ఇచ్చిన ద్విచక్ర వాహనంపై 56,000 కిలోమీటర్ల ప్రయాణం చేసి తల్లికి ఎన్నో దేవాలయాలు చూపాడు ఆ కుమారుడు. ఆనంద్ మహీంద్రా ఇచ్చిన వాహనాన్ని కాదని ద్విచక్ర వాహనంపైనే ఎందుకు తీర్థ యాత్రలకు వెళ్తున్నారో తెలుసా..?
వివరాల్లోకి వెళితే.. డీ కృష్ణకుమార్ కర్ణాటక (Karnataka) రాష్ట్రంలోని మైసూర్ లో జన్మించారు. తల్లి చూడరత్నమ్మ., తండ్రి దక్షిణ మూర్తిలది ఉమ్మడి కుటుంబం. కృష్ణకుమార్ తల్లి పెళ్లి అయిన నాటి నుంచి కేవలం ఇంటి పనులకే పరిమితమై.., కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేవారు. తండ్రి కుటుంబ పోషణకు నిరంతరాయం శ్రమించేవారు. కృష్ణకుమార్ మాత్రం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించి.. అమ్మానాన్నలను చక్కగా చూసుకోవాలని నిశ్చయించుకున్నాడు. కార్పొరేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ గా పనిచేసేవాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో అవ్వ, తాత, అమ్మనాన్న, అత్తామామ అని అనేక బంధాల నడుమ పెరిగారు. భార్యాభర్తలు కలసి ఒంటరిగా వెళ్లలేని రోజులు అవి. ఇంటిలో వంట పని.. ఇంటి పని అంటూ తన జీవితాన్ని కుటుంబ సభ్యుల కోసం త్యాగం చేసింది చూడరత్నమ్మ.
ఏడేళ్ల క్రిందట కృష్ణకుమార్ తండ్రి దక్షిణ మూర్తి కాలం చెందారు. దీంతో కార్పొరేట్ టీం లీడర్ గా బెంగుళూరులో విధులు నిర్వహిస్తున్న కృష్ణ కుమార్ తన తల్లిని సైతం బెంగళూరుకు తీసుకెళ్లారు. అమ్మతో ముచ్చటిస్తూ తిరువనంతపురం., తిరుపతి (Tirupati)., తిరువణ్ణామలై., తిరుత్తణి., ఇతర పుణ్య క్షేత్రాల్లోని దేవాలయాలు సందర్శించారా అని తల్లిని అడిగారు కృష్ణకుమార్. అందుకు చూడరత్నమ్మ తాను ఇంతవరకు పక్కన ఉన్న ఆలయాలే చూడలేదని నిరాశగా చెప్పారు. దీంతో అమ్మకు దేశంలోని ప్రముఖ దేవాలయాలు చూపుతానని మాట ఇచ్చాడు.
2018 జనవరి 16వ తేదీ నుంచి మాతృసేవే సంకల్ప యాత్ర చేపట్టారు. దేశంలోని చాల దేవాలయాలు కృష్ణకుమార్ నాన్న దక్షిణ మూర్తి మొదటి బహుమానం ఇచ్చిన బజాజ్ చేతక్ స్కూటర్ పైనే 56,000కిలో మీటర్లు తీర్థ యాత్ర చేపట్టారు. ఇండియాలోని దర్శనీయ ప్రదేశాలే కాకుండా... బూటాన్., నేపాల్ వంటి ప్రాంతాలను సైతం కృష్ణ కుమార్ తన తల్లిని మోటార్ సైకిల్ పై తీసుకెళ్లి ఆమె కళ్ళలో ఆనందం చూసారు. కృష్ణ కుమార్ తల్లి ప్రేమను మెచ్చిన ఆనంద్ మహీంద్రా 2019 అక్టోబర్ నెలలో మహీంద్రా కారును గిఫ్ట్ గా ఇచ్చారు.
మహీంద్రా కారు ఉన్నా చేతక్ పైనే ప్రయాణం
తల్లి చూడరత్నమ్మ మరిదిరిగానే దక్షిణ మూర్తి కుటుంబం కోసమే పరితపించే వారు. ఆయన కూడా ఇల్లు... ఆఫీస్ తప్ప వేరే ప్రాంతాలు తెలియని వ్యక్తి. కృష్ణకుమార్ కి తన తండ్రి మొదటి కానుకగా చేతక్ బైక్ ను ఇచ్చారు. అప్పటి నుంచి ఆ బైక్ ను ఎంతో అపురూపంగా చూసుకుంటూ వస్తున్నాడు. మాతృసేవే సంకల్ప యాత్ర చేపట్టిన నాటి నుంచి నేటి వరకు చేతక్ బైక్ పైనే ప్రయాణం సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ తల్లీ కొడుకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తనకు ఇచ్చిన మొదటి గిఫ్ట్ ద్వారా తన తండ్రిని చూసుకుంటున్నారు. బైక్ ను యాత్రకు తీసుకెళ్లడంతో తమ తండ్రి తమతో ఉన్నారనే భావన వారిలో కలుగుతుందని అంటున్నారు కృష్ణ కుమార్.
"తమ స్వార్ధాలు వీడి పిల్లలు తల్లితండ్రుల కోసం ఓ అరగంట కేటాయించాలని నేటి తరాన్ని కోరుకుంటున్న. ఎన్నో త్యాగాలు చేసి...మనల్ని పెంచి పెద్ద చేసిన మాతృ మూర్తులకు ఈ జన్మలోనే సేవ చేయాలి. వారు కాలం చెల్లిన అనంతరం.... వారి ఫోటోకి పూలమాల వేసి... నచ్చిన ఫలహారాలు వారి ఫోటోకి పెడితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మన దగ్గర ఉన్న సమయంలోనే వారిని ఆనందంగా చూసుకోవాలని అందిరిని కోరుతున్నట్లు" న్యూస్18 తో మాట్లాడారు కృష్ణ కుమార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Karnataka, Tirupati