GT Hemanth Kumar, News18, Tirupati
అరుదైన ఎర్రబంగారం (Red Sandal) అత్యంత భారీ స్థాయిలో లభించేది శేషాచల అటవీ ప్రాంతం. ఇక్కడ నూటికి 10 ఎర్రచందనం చెట్లే ఉంటాయి. వివిధ ఔషధ మొక్కలు కలిగిన శేషాచలంలో అమూల్యమైన విలువ గల ఈ ఎర్రబంగారనికి విదేశాల్లో ఉన్న డిమాండే వేరు. టన్ను ఎర్ర చందనం విలువ సుమారు కోటి రూపాయల పైనే ఉంటుంది. దీనిని రాష్ట్రం శేషాచలం నుంచి తమిళనాడు (Tamilanadu) రాష్ట్రానికి.., చెన్నై హార్బర్ నుంచి చైనా, జపాన్ దేశాలకు అక్రమంగా తరలిపోతోంది. అడ్డువచ్చిన వారిని తొకెక్కుకుంటు పోవాలే.., లేకుంటే కళ్లుగప్పి నక్కినక్కి పోవాలే అనే సిద్దాంతాన్ని స్మగర్లు అవలంభిస్తున్నారు. పుష్పసినిమా వచ్చిన తర్వాత స్మగ్లర్లు కొత్త ఐడియాలను ఫాలో అవుతున్నారు. పోలీసుల కళ్లుగప్పి వివిధ వాహనాల ద్వారా ఎర్రచందనం ఎర్రబంగారాన్ని తరలించేస్తున్నారు.
రీల్ పుష్ప మిల్క్ ట్యాంకర్ ను ఎంచుకోగా.. రియల్ పుష్పలు అంబులెన్స్ ను అక్రమ రవాణాకు వినియోగించి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. వివరాల్లోకి వెళ్ళితే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని చిత్తూరు జిల్లా (Chittoor District) లో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పోలీసుల కళ్ళు హప్పేందుకు నూతన మార్గాన్ని ఎంచుకున్నారు స్మగ్లర్లు. ఎవరు ఊహించని రీతిలో అంబులెన్స్ లో స్మగ్లింగ్ కు పాల్పడుతున్న 15 మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను అరెస్ట్ చేయడంతో పాటు కోటి రూపాయల విలువ గల 71 ఎర్రచందనం దుంగలు మూడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
చిత్తూరు పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు వేలూరు రోడ్డులోని మాపాక్షి మలుపు వద్ద వాహనాలు తనిఖీలు చేపట్టారు. అట్టు వైపుగా వస్తున్న ప్రైవేట్ అంబులెన్స్ వాహనంలో ఎర్రచందనం అక్రమ రవాణాను గుర్తించి అంబులెన్స్ లో ఉన్న ఎనిమిది మంది ఎర్రచందనం కూలీ లతో పాటుగా.. ఇద్దరు మేస్త్రీలు ఒక డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి రూ.50 లక్షల విలువ చేసే 36 ఎర్రచందనం దుంగలతో పాటు అంబులెన్స్ ను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై-బెంగళూరు రోడ్డులో వాహనాల తనిఖీలు చేపట్టామని వాటర్ క్యాన్ల ముసుగులో టాటా ఏస్ వాహనంలో ఎర్రచందనం దుంగలు తరలిస్తుండగా ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. వీరి వద్ద నుండి రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనంతో పాటు 35 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ.10లక్షలు విలువ చేసే రెండు వాహనాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు వేర్వేరు కేసుల్లో నలుగురు ప్రధాన ముద్దాయిలు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్స్ తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన వారని, వీరిపై గతంలో అనేక ఎర్రచందనం అక్రమ రవాణా తరలింపుపై కేసులు నమోదు అయ్యినట్లు వెల్లడించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్స్ పై ప్రత్యేక నిఘా ఉంచామని, చెక్ పోస్టులు ద్వారా నిరంతరాయంగా వాహనాలు తనిఖీ చేపడుతున్నట్లు ఎస్పీ రిశాంత్ రెడ్డి వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Chittoor, Red sandal