GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
ఈ లోకంలో ప్రేమకు (Love) ఎల్లలుండవు. దేశం, భాష, మతం, కులంతో సంబంధమే ఉండదు. రెండు దేశాలకు చెందిన వారు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలానే వెలుగు చూశాయి. అలా తాను ప్రేమించిన వాడి కోసం దేశం వదిలి భారత్ కు వచ్చిన ఓ యువతికి అనుకోని కష్టం ఎదురైంది. ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రియుడు మృతిచెందడంతో ఆమె బ్రతుకు చీకటిగా మారింది. చివరకు పోలీసులు చొరవ తీసుకొని ఆ యువతిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేశారు. ఆమె జీవితంలో వెలుగు నింపారు. వివరాల్లోకి వెళ్తే.., ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కడప జిల్లా రాజంపేటకు చెందిన కామినేని నారాయణ కువైట్ (Kuwait) లో డ్రైవర్ గా పనిచేసేవాడు. అక్కడే పనిచేస్తున్న ఇథియోపియాకు చెందిన యువతి ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే(33)తో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో ఇద్దరూ 2015లో రాజంపేటకు వచ్చారు. ఓ ఇల్లు అద్దెకు తీసుకొని అక్కడే ఉన్నారు. ఐతే ఆర్ధిక సమస్యల కారణంగా డబ్బు సంపాదించుకొస్తానని నారాయణ మళ్లీ కువైట్ వెళ్లాడు. అప్పటినుంచి నెలనెలా ఆమెకు డబ్బు పంపిస్తూ ఉండేవాడు. ఐతే యువతి ఇండియన్ వీసా గడువు ముగియడంతో ఎవరిని కలవాలో తెలియక నిస్సాహాయ స్థితిలో ఉండేది. అదే సమయంలో ప్రియుడు నారాయణ కువైట్ లో గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో ఆమె జీవితం ఒక్కసారిగా అంథకారంలో కూరుకుపోయింది. గత ఏడాది మార్చిలో ప్రియుడు నారాయణకు అత్యక్రియలు నిర్వహించారు.
విధి తనపై ఇంతగా పగపట్టిందే అనుకుంటూ తీవ్ర మానసిక వేదను అనుభవించిన ఏమనాబిర్హన్.. కనీసం తినడానికి తిండికూడా లేక నరకం చూసింది. ఈ నేపథ్యంలో స్థానికుల ద్వారా జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయంలో ఉన్న ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్లి.. ఎస్పీ కేకే అన్బురాజన్ తో తన గోడు వెళ్లబోసుకుంది. తనను ఇథియోపియాకు పంపించాలని ప్రాధేయపడింది. తక్షణం స్పందించిన జిల్లా ఎస్పీ తగిన చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇథియోపియా దేశానికి చెందిన ఎంబసీ అధికారులతో సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపారు. అదే సమయంలో యువతిని ప్రియుడు నారాయణ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచారు.
ఇదిలా ఉంటే ఇటీవల ఆమెకు కొవిడ్ సోకడంతో కష్టాలు రెట్టింపయ్యాయి. ఆ సమయంలో పోలీసులే ఆమెకు మెడికల్ కిట్లు, వైద్యసాయం, పౌష్టికాహారం అందించి సాయపడ్డారు. మరోవైపు పోలీసులు ఇథియోపియా ఎంబసీతో సంప్రదింపులు జరిపి ఎమర్జన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ (E.T.D) ద్వారా స్వదేశానికి వెళ్లే ఏర్పాట్లు చేశారు. గురువారం ట్రైన్ ద్వారా ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న యువతి.. అక్కడి నుంచి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా కు క్షేమంగా చేరుకుంది. స్వదేశానికి వెళ్లిన తర్వాత తాను క్షేమంగా చేరుకున్నానని.. తనను రక్షించి అండగా నిలిచిన పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police, Kadapa