ప్రస్తుతం ఏ వేడుక చూసినా బుల్లెట్ బండి (Bullet Bandi Song)పాటే వినిపిస్తోంది. సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అయిన బుల్లెడ్ బండి పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఇటీవల బుల్లెట్ బండి పాటలేని పెళ్లిళ్లుగానీ, ఫంక్షన్లు గానీ లేవంటే అతిశయోక్తికాదు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. పేదల నుంచి ధనికుల వరకు...సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతిఒక్కరూ బుల్లెట్ పాటకు స్టెప్పులేసి అదరగొడుతున్నారు. అంతెందుకు ఆస్పత్రుల్లో పేషెంట్లకు నయం కావాలన్నా.. స్కూల్లో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్ధంకావాలన్నా బుల్లెట్ పాట మ్యాజిక్ చేస్తోంది. అంతలా పాపులర్ అయిన ఈ సాంగ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నివాసంలో సందడి చేయించింది. వారి కుటుంబాన్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తింది. మంత్రిగారింట్లో జరిగిన వేడుకలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి (Dy CM Narayana Swamy) తన 42వ పెళ్లిరోజు జరుపుకున్నారు. చిత్తూరు జిల్లా (Chittoor District) తిరుపతి (Tirupati)లోని ఆయన నివాసంలో జరిగిన వేడుకల్లో నారాయణస్వామి సతీమణి, కుమార్తె బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. నారాయణ స్వామి సోఫాలో కూర్చొని ఉండగా భార్య, కుమార్తె డాన్సువేశారు. పెళ్లిరోజు సతీమణి సర్ ప్రైజ్ ఇవ్వడంతో నారాయణ స్వామి ఆనందంలో మునిగిపోయారు.
ఇటీవల తెలంగాణ ఎంపీ మాలోత్ కవిత (Telangana MP Malot Kavitha) బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన ఓ పెళ్లికి హాజరైన కవిత.., వధూవరులను ఆశీర్వదించిన తర్వాత.. బుల్లెట్ బండి పాటకు స్టెప్పులేశారు. వధూవరులతో పాటు ఎంపీ కవిత కూడా డ్యాన్స్ చేశారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కొన్ని రోజులు క్రితం మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పెళ్లి కూతురు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాను ఊపేసిన విషయం తెలిసిందే. మంచిర్యాల జిల్లా జన్నారానికి చెందిన అటవీ శాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె.. సాయి శ్రీయను రామకృష్ణాపూర్కు చెందిన ఆకుల అశోక్తో ఆగస్టు 14న పెళ్లి చేశారు. అయితే అప్పగింతల సమయంలో సాయిశ్రీయ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. యూట్యూబ్లో ఈ వీడియోను 50 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఆ తర్వాత ఓ నర్సు కూడా ఇదే పాటకు స్టెప్పులేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పీహెచ్సీలో పనిచేస్తున్న నర్సు బుల్లెట్ పాటకు డాన్స్ చేసి ఆకట్టుకుంది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున వేడుకలు ముగిసిన తర్వాత.. ఆస్పత్రిలోని నర్సులంతా కలిసి సందడి చేశారు. వారిలో ఒక నర్సు డాన్స్ చేస్తుండగా.. మిగతా వారు చప్పట్ల కొట్టి ఎంకరైజ్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. పెళ్లి కూతురు వీడియోలా ఇది కూడా వైరల్ అయింది. ఐతే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: ', Andhra Pradesh, Narayana Swamy, Tirupati