GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18
మోసపోయేవాళ్లు ఉన్నంత కాలం.. మోసం చేసేవాళ్లకు తిరుగుండదు. అమాయకత్వం, అత్యాశ, అదృష్టం వంటి బలహీనతలను క్యాష్ చేసుకునేందుకు చీటర్స్ కొత్తకొత్త దారుల్లో వస్తుంటారు. అలా వచ్చిన ఓ ముఠా... డబ్బు ఆశ చూపి అందినకాడికి దోచుకుపోయింది. ఏకంగా పోలీసుల వేషంలో వచ్చి నిలువుదోపిడీ చేస్తోంది. చేసిన మోసం ఊరికే ఉండదుగా చివరికి కటకటాల్లోకి వెళ్లారా మాయగాళ్లు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాల్లో ఓ ముఠా.. బ్లాక్ మనీని వైట్ చేయాలంటూ మోసాలకు పాల్పడుతోంది. తమ దగ్గర రూ.2వేల నోట్లు ఉన్నాయని.. వాటిని రూ.500 నోట్లతో మార్పిడి చేయాలంటూ బురిడీ కొట్టిస్తోంది. ఇలా మధ్యవర్తుల ద్వారా కొందరిని సంప్రదించి రూ.90 లక్షలు విలువ చేసే 500 నోట్లు ఇస్తే.. రూ.కోటి విలువైన 2వేల రూపాయల నోట్లు ఇస్తామంటూ నమ్మిస్తున్నారు. అవతలి పార్టీ డబ్బు రెడీ చేసుకోగానే... ఓ స్పాట్ లో నగదు ఎక్స్ ఛేంజ్ చేసుకుందామని చెప్తారు.
మోసగాళ్లు చెప్పిన చోటుకి దొంగనోట్లు తీసుకురావడం.. బాధితులు అసలైన నోట్లతో రాగానే.. తమిళనాడు పోలీస్ యూనిఫామ్ లో అక్కడికి చేరుకొని అసలైన నోట్లను పట్టుకుపోవడం వారికి అలవాటుగా మారింది. జిల్లాలో చాలా మందిని ఇలా మోసం చేసినట్లు తెలుస్తోంది. ఐతే తమ పరువు పోతుందని కొందరు, డబ్బు విషయం బయటకు తెలుస్తుందని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడారు.
ఈ నెల 2వ తేదీన ఇలాంటి దోపిడీకి పాల్పడటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారించారు. దోపిడీ ముఠా వాహనాల నెంబర్లతో పాటు ముబైల్ నెంబర్లు మారుస్తుండటంతో పోలీసులకు సవాల్ గా మారింది. దీంతో సరిహద్దు చెక్ పోస్టులపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో చిత్తూరు, వేలూరు హైవేపై వాహనాలు తనిఖీ చేస్తుండగా తమిళనాడు పోలీస్ యూనిఫామ్ లో అనుమానాస్పదంగా ఉన్న ఐదుగుర్ని అదుపులోకి తీసుకోని విచారించగా.. వీళ్లే దోపిడీ ముఠాగా తేలింది. వారి వద్ద నుంచి మూడు ఖరీదైన కార్లు, రూ.32 లక్షలు, రెండు తుపాకుల, లాఠీలు, పోలీస్ యూనిఫామ్, తొమ్మిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్ మనీ ఎక్స్ ఛేంజ్ పేరుతో వచ్చే ముఠాల మాటలు నమ్మి మోసపోవద్దని.. అలాంటి వారికి సహకరించిన వారు కూడా చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు. కేసులో దర్యాప్తులో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులకు రివార్డులు అందజేశారు. ఇలాంటి ముఠాలు పాత నోట్ల రద్దు సమయంలో తెలుగు రాష్ట్రాల్లో భారీగా దోచుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Black Money, Crime news, Tirupati