ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నూతనంగా నియమితులైన ముగ్గురు శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టుకు మరో ముగ్గురు న్యాయమూర్తులను నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు హైకోర్టులోని ఒకటో నంబర్ హాల్లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (చీఫ్ జస్టిస్) జితేంద్ర కుమార్ మహేశ్వరి నూతనంగా నియమితులైన న్యాయమూర్తులతో ప్రమాణస్వీకారం చేయించారు. అంతకుముందు హైకోర్టు ఇన్ చార్జ్ రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను చదివి వినిపించారు.
నూతన న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి, జస్టిస్ కన్నెగంటి లలిత కుమారి అలియాస్ లలిత దస్త్రాలపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ అడ్వకేట్లు, జడ్జిలు, ప్రమాణస్వీకారం చేసిన న్యాయమూర్తుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP High Court, High Court