ఏపీ, తెలంగాణ మధ్య కొంతకాలంగా నెలకొన్ని జలవివాదాల పరిష్కారానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే అంశంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాష్ట్రం కృష్ణా నీటిని అక్రమంగా విద్యుత్ కోసం వినియోగిస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. తెలంగాణను కట్టడి చేయాలని ఏపీ సీఎం జగన్ ఇప్పటికే పలుసార్లు కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఏపీ, తెలంగాణ జలజగడాన్ని కేఆర్ఎంబీ అడ్డుకోలేకపోతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం రంగంలోకి దిగాల్సిన పరిస్థితి ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తాజాగా బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలుగు రాష్ట్రాల నీటి సమస్యపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోబోతుందని జితేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు తనకు ఢిల్లీ నుంచి సంకేతాలు వచ్చాయని తెలిపారు. రెండు వారాల్లో జలవివాదంపై బోర్డు ఏర్పాటవుతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు ఇరు రాష్ట్రాల ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ జవాన్లను మొహరిస్తారని జితేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టుల పర్యవేక్షణ మొత్తం ఇక కేంద్ర ప్రభుత్వం పరిధిలోకే వెళుతుందని జితేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మొత్తానికి జితేందర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో కేంద్రం నిజంగానే ఈ రకమైన చర్యలు తీసుకుంటుందా లేక ఇరు రాష్ట్రాలతో చర్చలు చేపడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు జితేందర్ రెడ్డి చెప్పినట్టే కేంద్రం చేస్తుందా అనే వాదన కూడా వినిపిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రాజెక్టులను తన పరిధిలోకి తీసుకోవడం, ఆ ప్రాజెక్టుల దగ్గర కేంద్ర బలగాలను మోహరించడం వంటి నిర్ణయాలు కేంద్రం తీసుకుంటే.. అది ఏపీ సీఎం జగన్ కోరినట్టే అవుతుందనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Telangana, Water dispute