మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) లో సీఎం జగన్ (CM Jagan) పై టీడీపీ (TDP) సంచలన ఆరోపణలు చేస్తోంది. ఈ కేసులో సీఎం జగన్.. మౌనం వీడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు జగనే... వైఎస్ వివేకా హత్యకు పథక రచన చేసి ఉంటారన్న అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాన్ని బట్టి చూస్తే.. వేళ్లన్నీ జగన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయన్నారు. ఇప్పటికే అన్ని వాంగ్మూలాలు సీఎం జగన్, వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నా.. ముఖ్యమంత్రి ఎందుకు నోరు విప్పడం లేదుని ప్రశ్నించారు. ఈ విషయంలో సీఎం మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మౌనం నేరాంగీకారమని భావించాలా? అని వర్ల రామయ్య అన్నారు.
వివేకా హత్య కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది.. ఇప్పటికే 11 సీబీఐ కేసులు ఉన్నాయి.. ఇది 12వది అవుతుందని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వస్తున్నాయన్నారు వర్ల రామయ్య. అంటే మీకు చట్టాలంటే లెక్కలేనితనమా? అంటే పరోక్షంగా వివేకా మర్డర్ కేసులో తన హస్తం ఉందని జగన్ గారు చెప్పకనే చెబుతున్నారా? అని ప్రశ్నించారు. వివేకా ఇంట్లో లేఖ దొరికిన విషయంగానీ, అందులో డ్రైవర్ ప్రసాద్ పేరు ఉన్నట్లుగానీ రాజశేఖర్ రెడ్డి, పోలీసులకు తప్ప ఎవరికీ తెలియదని., అయితే హత్య జరిగిన రోజు జగన్ తన విలేకరుల సమావేశంలో ఆ లేఖ గురించి ఎలా ప్రస్తావించారని ప్రశ్నించారు.
వివేకా హత్యను రాజకీయాలతో ముడిపెట్టి జగన్ రెడ్డి మాట్లాడటాన్ని బట్టి చూస్తే.. ఈ హత్య గురించి జగన్మోహన్ రెడ్డికి ముందే తెలుసని తేటతెల్లమవుతోందని వర్ల రామయ్య విమర్శించారు. అన్నీ తెలిసే.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నెపాన్ని అప్పటి సీఎం చంద్రబాబుపై నెట్టారన్నారు. నేడు అన్ని సాక్ష్యాధారాలు, వాంగ్మూలాలు జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపిస్తున్నాయిని.., దోషులను జగన్మోహన్ రెడ్డి ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు.
ఎన్నికల్లో గెలిచేందుకు కోడికత్తి కేసులానే ఈ హత్యను కూడా ఉపయోగించుకున్నారా? వివేకా హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి పాత్ర బయటపడినందున నైతిక బాధ్యత వహిస్తూ.. తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదా? ఒక హత్య కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వ్యక్తికి ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత ఉన్నదా? అని ప్రశ్నించారు వర్ల రామయ్య. ఎంపీ అవినాష్ రెడ్డిని రక్షించడానికి ముఖ్యమంత్రి సతీసమేతంగా పడుతున్న తాపత్రయం రాష్ట్ర ప్రజలందరికీ తేటతెల్లం అయిందని.., ఈ రక్తచరిత్ర సాక్ష్యాధారాలతో బయటపడిన నేపథ్యంలో నైతిక విలువలతో కూడిన నిర్ణయం సీఎం భుజస్కందాలపై ఉందని రాష్ట్ర ప్రజలందరూ భావిస్తున్నారన్నారు.
ఈ కేసులో ఇప్పటికే సీబీఐకి సాక్షులు, అనుమానితులు ఇచ్చిన వాంగ్మూలాలు బయటకు వస్తున్న నేపథ్యంలో రోజుకో మలుపు తిరుగుతోంది. అలాగే వివేకా కుమార్తె సునీత ఎంపీ అవినాష్ పై అనుమానం వ్యక్తం చేస్తూ లోక్ సభ స్పీకర్ కు లేఖ రాయడం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.