ఏపీలో గడిచిన పది రోజులుగా డ్రగ్స్ దందాపై రచ్చ కొనసాగుతుండగా, రాష్ట్ర పోలీసులు తొలిసారి యాక్షన్ లోకి దిగారు. గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోలీసులు నోటీసులు జారీ చేశారు. కాకినాడ నుంచి శుక్రవారం ఉదయం పొన్నూరు మండలం చింతలపూడిలోని నరేంద్ర ఇంటికి వచ్చిన పోలీసులు సదరు నోటీసులను అందజేశారు. కాకినాడ తీరంలో ఇటీవల తగులబడిపోయిన ఓ బోటుకు సంబంధించి నరేంద్ర చేసిన వ్యాఖ్యలపైనే ఇప్పుడాయనకు నోటీసులు జారీ అయ్యాయి..
కాకినాడ తీరంలో తగలబడ్డ బోటు..
డ్రగ్స్ ఉదంతంపై ధూళిపాళ్ల మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘కాకినాడ సముద్రతీరంలో ఈ మధ్యే ఒక బోటు తగలబడింది. అది కాలిపోతున్నప్పుడు ఘాటైన డ్రగ్స్ వాసన వచ్చిందని, అది సాధారణ బోటు మాత్రం కాదని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అయితే, పోలీసులు మాత్రం అదొక చేపల బోటు అని, బోటు తిరగబడటం వల్లే ప్రమాదవశాత్తూ కాలిపోయి, అందులో ఉన్న వ్యక్తి కూడా చనిపోయాడని అంటున్నారు. దీనిపై పోలీసులు సమగ్రంగా ఎందుకు దర్యాప్తు చేయడంలేదు?’అని నరేంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ధూళిపాళ్ళ సంధించిన ప్రశ్నలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. నరేంద్ర ఆరోపణలను కాకినాడ పోలీసులు ఖండించారు. విద్యుదాఘాతంతోనే బోటులో అగ్నిప్రమాదం జరిగిందేగానీ, టీడీపీ నేత చెబుతున్నట్లు కాదని కాకినాడ డీఎస్పీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు అదే అంశంపై నరేంద్రకు పోలీసులు నోటీసులిచ్చారు..
నరేంద్రకు నోటీసులు..
కాకినాడ పోలీసుల నుంచి నోటీసులు అందుకున్న తర్వాత టీడీపీ నేత నరేంద్ర మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ దందాపై రెండు రోజులు కిందట చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలకు ఆధారాలు చూపించాల్సిందిగా పోలీసులు నోటీసులు ఇచ్చారని, కాకినాడకు వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా కోరారని ఆయన చెప్పారు. నిజానికి కాకినాడ తీరంలో బోటు తగలబడినప్పుడు మాదకద్రవ్యాల వాసన వచ్చిందనే సమాచారం తనకు మీడియా ద్వారా తెలిసిందని, ఆ విషయాలనే ప్రెస్ మీట్ లో మాట్లాడానన్న ధూళిపాళ్ల.. తనకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుపట్టారు.
పోలీసులపై ధూళిపాళ్ల ఫైర్..
ఏపీలో పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత మండిపడ్డారు. వేల కోట్ల డ్రగ్స్ దొరికితే ముఖ్యమంత్రి తీరిగ్గా స్పందించారని, ద్యాసంస్థల్లో మత్తు మందులు ఉండరాదన్న సీఎం మాటలు అనుమానాలకు తావిస్తోందని, ఏపీలో ఇప్పటి వరకూ విద్యాసంస్థల్లో మత్తు మందులు ఉన్నట్లేనని అంగీకరించినట్లుగా సీఎం మాటలున్నాయని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు. నోటీసులు ఇవ్వడానికి వచ్చిన కాకినాడ పోలీసులకు దూళిపాళ్ల పలు ప్రశ్నలు సంధించారు..
ఎన్ఐఏ వర్సెస్ ఏపీ పోలీసులు..
డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వదిలి తమకు నోటీసులు ఇవ్వడమేమిటని టీడీపీ నేత ధూళిపాళ్ల కాకినాడ పోలీసులను ప్రశ్నించారు. ‘ఇప్పటివరకు ఈ కేసుకు సంభధించి ఏం సమాచారం సేకరించారని నిలదీశారు. డ్రగ్స్ కేసును కేంద్ర సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుండగా, ఏపీ పోలీసులు ఆధారాలు సేకరించడమేంటి? డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ పెద్దలను పోలీసులు ఎందుకు ప్రశ్నించడంలేదు? హెరాయిన్ విజయవాడ ఆసీట్రేడింగ్ పేరుతో వచ్చింది, పైగా గత ఏడాది సెప్టెంబర్ నుంచి 9సార్లు జీఎస్టీ కట్టింది, దీనిపై విచారణ జరిపారా?’అని ’ అని నరేంద్ర పోలీసులను ప్రశ్నించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP Police, Drugs case, Kakinada, TDP