ఏ పార్టీకైనా కేడర్ ను నడిపించే లీడర్ కావాలి. అలా లేకుంటే మాత్రం ఓటమి మూటగట్టుకోవాల్సిందే. ఇంకా చెప్పాలంటే గెలుపుపై ఆశలు వదులుకోవాల్సిందే. ముఖ్యంగా ప్రత్యర్థి బలంగా ఉన్నచోట అంతే బలమైన నేతను తయారు చేసుకోవాలి. లేదంటే ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న చోటా నేతలు, కార్యకర్తలు చేజారిపోయే ప్రమాదముంది. మొక్కుబడిగా పోటీ చేయడం తప్ప గెలుపుకోసం ప్రయత్నించే పరిస్థితులుండవు. ప్రసుతం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కొన్ని స్థానాల్లో తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) పరిస్థితి అలాగే ఉంది. మరీ ముఖ్యంగా టీడీపీ (TDP) కి కీలకమైన కృష్ణాజిల్లా గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో ఆ పార్టీ పరిస్థితి ఘోరంగా ఉందనే చెప్పాలి. ఇక్కడ ప్రత్యర్థిని ఢీ కొట్టే బలమైన నేతను నెలబెట్టడంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలుగు తమ్ముళ్లే చర్చించుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీకి గుడివాడ నియోజకవర్గం అత్యంత కీలకం. ఎందుకంటే పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గం గుడివాడ. నిమ్మకూరు ప్రస్తుతం గుడివాడ పరిధిలో లేకపోయినా ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం అంటే అదే. కానీ అక్కడ టీడీపీ పరిస్థితి దారణంగా ఉంది. ప్రస్తుత మంత్రి కొడాలి నాని (Kodali Nani).. గతంలో టీడీపీలోనే ఉన్నా.. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరి ఎమ్మల్యేగా గెలిచి మంత్రయ్యారు. అక్కడ నానిని ఢీ కొట్టే ధీటైన అభ్యర్థి టీడీపీకి లేరు.
గత రెండు ఎన్నికల్లోనూ అక్కడ గట్టి అభ్యర్థిని నిలబెట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారు. రావి వెంకటేశ్వరరావు, దేవినేని అవినాష్.. నాని బలం ముందు నిలబడలేకపోయారు. అవినాష్ పార్టీని వీడిన తర్వాతైనా చంద్రబాబ గుడివాడపై పెద్దగా దృష్టిపెట్టలేదు. మధ్యలో వంగవీటి రాధా పేరు వినిపించినా అందులో నిజం లేదని తేలిపోయింది. కొడాలి నాని.. చంద్రబాబు,లోకేష్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తినా నియోజకవర్గంలో ఆ వ్యాఖ్యలను తిప్పికొట్టే నేతలేరు.
ఇక గన్నవరంలోనూ టీడీపీది దాదాపు ఇదే పరిస్థితి. 2019లో వైసీపీ వేవ్ లోనూ వల్లభనేని వంశీ మోహన్ (MLA Vallabhaneni Vamsi) విజయం సాధించారు. కానీ ఆ తర్వాత ఆయనపై సోషల్ మీడియాలో తప్పు ప్రచారం చేస్తున్నారని.. లోకేషే ఇదంతా చేయించారని ఆరోపిస్తూ ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడికి గన్నవరం బాధ్యతలు అప్పగించినా ఆయన ఫ్లెక్సీలకే పరిమితమయ్యారే తప్ప పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ అయిన సందర్భాలు లేవు.
ఇక చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై వల్లభనేని వంశీ అనుచిత వ్యాఖ్యలు చేసినా అందుకు ధీటుగా స్పందించిన టీడీపీ నేత గన్నవరంలో లేరు. చివరకు ఆయనే క్షమాపణ చెప్పడంతో వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. వచ్చే ఎన్నికల్లో గన్నవరం టీడీపీ అభ్యర్థి ఎవరంటే ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. ఈ మధ్య గద్దె రామ్మోహన్ వస్తారని ప్రచారం జరుగుతున్నా క్లారిటీ మాత్రం లేదు.
ఎవరైనా నేత కొత్త నియోజకవర్గానికి వెళ్లి అక్కడ కార్యకర్తలు, ప్రజలకు దగ్గరవ్వాలంటే కనీసం ఏడాది పడుతుంది. అలాంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి బలమైన నేతలున్న నియోజకవర్గాలకు వెళ్లి వారికి గట్టిపోటీనివ్వాలంటే మాత్రం కనీసం రెండేళ్లైనా కావాలి అంతేకాదు. అంగబలం అర్ధబలం కూడా ఉండాలి. కానీ చంద్రబాబు మాత్రం ఆదిశగా ఆలోచించడం లేదని తెలుగు తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీళ్లిద్దరిపై రాష్ట్రకార్యాలయంలో, జూమ్ మీటింగ్ లలో ఎన్ని విమర్శలు చేసినా ప్రయోజనం ఉండదని.. నియోజకవర్గంలోనే విమర్శలను తిప్పికొట్టే నేతలు కావాలని తమ్ముళ్లు కోరుతున్నారట. చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోకుంటే.. గుడివాడ, గన్నవరంలో టీడీపీ పోటీ నామామాత్రంగానే ఉంటుందంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.