లాక్డౌన్ నుంచి సడలింపులు ఇవ్వడంతో పలు రాష్ట్రాల్లో ఆలయాలు తెరచుకున్నాయి. భక్తులంతా మాస్క్లు ధరించి.. భౌతిక దూరం పాటిస్తూ దైవ దర్శనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో జూన్ 12 నుంచి శ్రీకాళహస్తిలోనూ భక్తులను అనుమతించాలని ఇది వరకు నిర్ణయించారు. ఐతే అంతలోనే ఆలయంలో కరోనా కలకలం రేగింది. శ్రీకాళహస్తి దేవాలయంలో పనిచేసే ఓ అర్చకుడిని కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో 12 నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించాలన్న నిర్ణయం వాయిదా పడింది. మొత్తం 71 మందికి కరోనా పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. మరికొందరి రిపోర్టులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు భక్తులను ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.
అటు తిరుమల శ్రీవారి ఆలయంలో దర్శనాలకు ప్రస్తుతం టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. జూన్ 11 నుంచి సామాన్య భక్తులను అనుమతిస్తారు. తిరుమల శ్రీవారిని జూన్ 11న దర్శించుకునే భక్తులకు జూన్ 10న తిరుపతిలోని మూడు ప్రాంతాలలో గల 12 కౌంటర్లలలో ప్రతి రోజు 3 వేల ఉచిత దర్శన టోకెన్లు మంజూరు చేయనున్నారు. తిరుపతిలోని ఆర్టిసి బస్టాండ్, విష్టునివాసం, అలిపిరి వద్దగల భూదేవి కాంప్లెక్స్లలో బుధవారం ఉదయం 5.00 గంటల నుండి దర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు ప్రతి ఒక్కరికి థర్మల్ స్క్రీనింగ్ మరియు శానిటైజెషన్ చేసిన అనంతరం మాత్రమే తిరుమల దర్శనానికి అనుమతిస్తారు.
Published by:Shiva Kumar Addula
First published:June 09, 2020, 20:26 IST