ఏ పొలికిల్ పార్టీకైనా గెలిచే నేతలే కావాలి. పార్టీలు, నియోజకవర్గాలతో సంబంధం లేకుండా విజయాన్ని వెనుకేసుకోని తిరిగేవాళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి నేతల వ్యూహాలకు తిరుగుండదు. వారికి టైమ్ తో పాటు టైమింగ్ కూడా కలిసొస్తుంటుంది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో అలాంటి నేతలు అరుదు. వారిలో ముందు వరుసలో ఉంటారు గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasarao) . పార్టీ ఏదైనా, నియోజకవర్గం ఎక్కడైనా ఆయన ఎంటర్ అయితే గెలిచి తీరుతారు. విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లో ఎక్కడి నుంచి పోటీ చేసినా గంటా గెలుపు గ్యారెంటీ. గత ఎన్నికల్లో కూడా భీమీలి నుంచి విశాఖ నార్త్ కు వచ్చి గెలిచారాయన. ఐతే టీడీపీ (TDP) ఓటమి పాలవడంతో అధికారం లేకుండానే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. మధ్యలో పార్టీ మారతారన్న ప్రచారం జరిగినా ఆయన మాత్రం టీడీపీ ఉండీ లేనట్లుగా కంటిన్యూ అవుతున్నారు.
ఐతే అధికారంలో లేకపోవడంతో ఎమ్మెల్యే పదవికి ఉండాల్సిన పవర్స్ లేకుండా పోయాయి. దీంతో ఆయన ఇప్పుడు సరికొత్త వ్యూహాలు వేశారు. ఒకేసారి రెండు వ్యూహాలను అమలు చేస్తున్నారాయన. కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉదమ్యం జరుగుతోంది. స్టీల్ ప్లాంట్ అంశం తెరపైకి రాగానే ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రిజైన్ చేసి ఏడాదైనా ఆమోదించకపోయే సరికి ఆయన ఇటీవలే స్పీకర్ లేఖ రాశారు. అధికారం లేని ఎమ్మెల్యే పదవి ఉన్నా, ఊడినా ఒకటే అని భావించారేమో.. అందుకే స్టీల్ ప్లాంట్ వంకతో రాజీనామా చేస్తే ప్రజల్లో ఇమేజ్ పెరగుతుందని గంటా భావించారన్న ప్రచారం జరుగుతోంది.
ఇక రాష్ట్రంలో బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిథిగా ఉన్న ఆయన ఇటీవల కాపు నేతలతో తరచూ సమావేశమవుతున్నారు. ఇందులో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ వంటి నేతలతో పాటు మాజీ డీజీపీ సాంబశివరావు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు. ఇప్పుడు తన సామాజిక వర్గాన్ని ఏకం చేసి సమస్యలపై పోరాడటం కోసం ఓ ఫోరం ఏర్పాటు చేశారు కూడా. దీని ద్వారా తన సామాజిక వర్గమంతా తనవైపే ఉందని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారట గంటా.
ఒకేసారిరెండు వ్యూహాలు అమలు చేయడం ద్వారా పొలిటికల్ గా మరో మంచి ఫ్లాట్ ఫారం క్రియేట్ చేసుకోవచ్చన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. గతంలో ఆయన వైసీపీలో చేరడానికి ట్రై చేసినా అవేమీ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత బీజేపీ పేరు వినిపించినా స్పష్టత రాలేదు. ఇటీవల ఆయన జనసేనకు జై కొడతారన్న ప్రచారం జరుగుతోంది. కానీ దానిపై గంటాగాని, జనసేన నేతలు గానీ స్పందించలేదు. ఐతే కాపుల మద్దతు, స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా సెంటిమెంట్ చూపించి ఆయన ఏపార్టీలోకి వెళ్లినా తనకు, తన మనుషులకు సీట్లతో పాటు గెలిస్తే మంచి పదవులు డిమాండ్ చేసే ఛాన్స్ కోసమే గంటా స్కెచ్ వేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. మరి గంటా ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా తెలుసుకోవాలంటే కొన్నాళ్లు ఒపిక పట్టాల్సిందే.!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.