విశాఖపట్టణంలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనకు మానవ తప్పిదమే కారణమని విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ నివేదిక ఇచ్చింది. సోమవారం ఎల్జీ పాలిమర్స్ కేసుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్జీటీకి శేషశయన నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ నివేదిక సమర్పించింది. గ్యాస్ లీకేజీకి మానవ తప్పిదమే కారణమని.. భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని తన నివేదికలో పేర్కొంది. ఇక ఎల్జీ పాలిమర్స్ తరపన సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూధ్రా వాదనలు వినిపించారు. ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం NGTకి లేదని వాదించారు. అటు 2001 నుంచి కూడా ఎల్జీ పాలిమర్స్ కంపెనీ అనుమతి లేకుండా నడుస్తోందని ఈఏఎస్ శర్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గ్యాస్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరి వాదనలు విన్న NGT ధర్మాసనం నివేదికను పరిశీలించాక లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరిస్తామని పేర్కొంది.
ఐదు కీలక తప్పిదాలను ఎత్తి చూపిన ఎన్జీటీ సభ్యులు
1) అత్యల్ప ఉష్ణోగ్రతల్లో స్టెరీన్ పాలిమరైజేషన్ను నిలువరించే టీబీసీ స్టోరేజ్ తగినంతగా ప్లాంట్లో అందుబాటులో లేదు
2) ప్లాంట్ లో అక్సీజన్ను ఆవిరిగా మార్చే క్రమంలో మానిటరింగ్ సిస్టమ్ను అమలు చేయడం లేదు.
3) స్టెరీన్ స్టోరేజ్ ట్యాంక్లో టాప్ లేయర్స్ లో ఉష్ణోగ్రతలను పర్యవేక్షణ చేసే వ్యవస్థను పాటించడం లేదు.
4) ప్లాంట్ లో రిఫ్రిజిరేషన్ సిస్టమ్ ను 24 గంటల పాటు ఆపరేట్ చేయడం లేదు
5) ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లోనూ, ప్లాంట్ లోని స్టోరేజ్ ట్యాంక్ వద్ద పర్సన్ ఇన్ చార్జ్ ల నిర్లక్ష్యం, తప్పిదం స్పష్డంగా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Lg polymers, Visakhapatnam, Vizag gas leak