P Anand Mohan, Visakhapatnam, News18
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వ్యాప్తంగా సంక్రాంతి వేడుకలు (Sankranhi Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడికక్కడే కోడిపందేలు, గుండాటలు, పేకాట పోటీలను పెద్దసంఖ్యలో ప్రజలు తిలకించారు. గోదావరి జిల్లాల వ్యాప్తంగా వందకు పైగా ఏర్పడ్డ కోడిపందేల బరులలో తొలిరోజు రోజుల్లో దాదాపు రూ.100కోట్లకు పైగానే చేతులు మారినట్టు సమాచారం. కోడిపందేల ప్రాంగణ ప్రాంతాల్లో గుండాటల నిర్వహణదారులు లక్షలాది రూపాయలు వేలం పాటలు పాడుకుని బహిరంగంగా బోర్డులు నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల కులాలు, రాజకీయ పార్టీలవారీగా పందెం బరులను ఏర్పాటుచేశారు. అధికార వైసీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులు పందెం బరులను లాంచ నంగా ప్రారంభించారు. వైసీపీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుల సమక్షంలోనే పలుచోట్ల పందేలు జరిగాయి.
వైసీపీ, టీడీపీతో సహా రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు, టీవీ యాంకర్లు, కమెడియన్లు పాల్గొని పందేలను వీక్షించారు. జిల్లాలోని కాకినాడ, రాజమహేంద్రవరం గ్రామీణ ప్రాంతాలతోపాటు కోనసీమ వ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో కోడిపందేలు, గుండాటలు, పేకాటలు జరిగాయి. కాట్రేనికోన మండలం దొంతికుర్రు-పల్లంకుర్రు మధ్య జిల్లాలోనే మెగా బరిలో పందేలు హోరెత్తాయి. రెండు రోజుల్లో 50కి పైగా జరిగాయి. ఒక్కో పందెం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు సాగింది. ఈ పందేల్లో ఉభయ రాష్ర్టాలకు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు. ఈ బరి వద్ద డబ్బులు లెక్కించేందుకు ప్రత్యేక కౌంటింగ్ మిషన్లు కూడా ఏర్పాటు చేశారు.
పలు చోట్ల పందేల్లో విజేతలుగా నిలిచిన వారికి వెండి నాణేలు, బుల్లెట్ బైకులు బహుమతులుగా దక్కాయి. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా కాట్రేనికోన మండలం గెద్దనపల్లి, చెయ్యేరు సహా పలు గ్రామాల్లో, ఉప్పలగుప్తం మండలం చినగాడవిల్లి, ఎస్. యానాం, భీమనపల్లి, చల్లపల్లి గ్రామాల్లో కోడిపందేలు, గుండాటలు హోరెత్తాయి.
అల్లవరం సడక్రోడ్డు, కోడూరుపాడు పరిధిలో పాటివారిపాలెం, గుబ్బలవారిపాలెం, దేవగుప్తం, గోడి, రెల్లుగడ్డ గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. అదేవిధంగా ముమ్మిడివరం మండలం రాజు పాలెం, పల్లిపాలెం, గేదెల్లంక, అన్నంపల్లి, కొత్తలంక, క్రాపచింతలపూడి, ఆత్రేయపురం మం డలంలోని బొబ్బర్లంక, వెలిచేరు, వద్దిపర్రు, ర్యాలి, లొల్ల గ్రామాల్లోను, ఐ.పోలవరం మండ లంలో మురమళ్ల, కొమరగిరి, జి.వేమవరంలోను, కొత్తపేట గ్రామంలోను, రావులపాలెం, రావులపాడు, వెదిరేశ్వరం తదితర గ్రామాల్లోను పి.గన్నవరం సహా ఏడు గ్రామాల్లోను, మలికి పురం మండలంలో మలికిపురం, రామరాజులంక, అమలాపురం రూరల్ మండలం వన్నె చింతలపూడి, సమనస, సవరప్పాలెం, తాండవపల్లి, చిందాడగరువు, ఇందుపల్లిలోని రెండు చోట్ల, అమలాపురం పట్టణంలో వై-జంక్షన్, ఎత్తురోడ్డు వద్ద పందెం బరులను ఏర్పాటు చేశారు.
అంబాజీపేట మండలంలో నందంపూడి వెళ్లే రోడ్డులోను, పోతవరం, సఖినేటిపల్లి మండలం సఖినేటిపల్లి, వీవీ మెరక, గొంది, కేశవదాసుపాలెం, మోరి తదితర గ్రామాల్లో కోడి పందేలు, గుండాటలు హోరెత్తిపోతున్నాయి. ఇక కోడిపందేల బరుల వద్ద రికార్డింగ్ డాన్సులు అదనపు ఆకర్షణగా నిలిచాయి. పలుచోట్ల పోలీసులు వారిని అడ్డుకున్నారు. తాటిపాకలో డ్యాన్సు ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు వేసిన స్టేజ్ను పోలీసులు తొలగించారు. అమలాపురం రూరల్ మండలం సమనసలో జనసేన, వైసీపీ బరులుగా రెండు బరులుగా ఏర్పాటు అవ్వడంతో రూరల్ ఎస్ఐ అందే పరదేశీ జనసేన బరి నిర్వాహకులను అదుపులోకి తీసుకుని పందేలను ఆపేయడంతో వివాదం తలెత్తింది.
పందెం బరుల వద్ద తిను బండారాల స్టాల్స్, చికెన్ పకోడి స్టాల్స్ కళకళ లాడాయి. కొన్నిచోట్ల మద్యం బెల్టుషాపులను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. కోనసీమ వ్యాప్తంగా పలుచోట్ల ప్రభల తీర్థాల నేపథ్యం లో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ అక్కడక్కడా పోలీసులు అడ్డుకుంటున్నట్టు సమాచారం.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.