P Anand Mohan, Visakhapatnam, News18
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. దాని ప్రభావంతో విధించిన ఆంక్షల కారణంగా ఉత్పత్తి ధరలు అమాంతం పెరిగిపోవ డంతో నూనె ధరలకు గడచిన పన్నెండు రోజులుగా రెక్కలు వచ్చాయి. ఒకరకంగా చెప్పాలంటే సామాన్యుడు దుకాణానికి వెళ్లి నూనె డబ్బా కొనాలంటే ధర చూసి కళ్లు తేలేస్తున్నాడు. పెరిగిన రేట్లతో జేబులకు గుల్ల చేసుకోవడానికి సాహసించ లేక కొనుగోలును సైతం తగ్గించుకుంటున్నాడు. దీంతో నూనె విక్రయాలు పడిపోయాయి. అటు తప్పనిసరి వినియోగం జరిగే హోటళ్లు, రెస్టారెంట్లు భారీ ధరలకు వీటిని కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదే అవకాశంగా కొందరు నూనె వ్యాపారులు ఏకంగా యుద్ధం పేరు చెప్పి అమాంతం రేట్లు పెంచి విక్రయిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.
వాస్తవానికి పన్నెండు రోజుల కిందట వరకు వంట నూనె ధర లు తక్కువగానే ఉండేవి. సన్ఫ్లవర్, ఫ్రీడమ్, ఇతర బ్రాండ్లు కిలో రూ.130 నుంచి రూ.138 వరకు విక్రయించేవి. అయిదు లీటర్ల డబ్బాలు రూ.700 నుంచి రూ.720 వరకు, 15 లీటర్లు రూ.1990 నుంచి రూ.2,200 వరకు అమ్మేవి. అయితే రష్యా- ఉక్రెయిన్ యుద్ధం మొదలవడంతో చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి బ్యారెల్ ధర ము నుపెన్నడూ లేనంత భారీగా పెరిగిపోయింది. రష్యా నుంచి ఎగుమతులపై విదేశాలు ఆంక్షలు విధించడంతో ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. దీంతో వంటనూనెల ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. దీంతో జిల్లాలో ధరలు భారీగా పెరిగాయి.
మొన్నటివరకు కిలో రూ.138 వరకు ఉన్న ప్రముఖ సన్ఫ్లవర్ బ్రాండ్ నూనె ఇప్పుడు రూ.175, అయిదు లీటర్లు రూ.890, 15 లీటర్ల డబ్బా రూ.2,7820 వరకు పెరిగిపోయింది. ఒకరకంగా చెప్పాలంటే గడచిన పన్నెండు రోజుల్లో వంట నూనెలపై కిలోకు రూ.37, అయిదు కేజీలపై రూ.170, 15 లీటర్లపై రూ.520 భారం పడింది. దీంతో వీటిని కొనలేక సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ధరలు తగ్గేవరకు కొందరు వినియోగం సైతం తగ్గించుకుంటున్నారు.
ఎప్పుడూ అయిదు లేదా పదిహేను లీటర్లు కొనే కుటుంబాలు కూడా ఇప్పుడు ధరల భగ్గుతో కిలో ప్యాకెట్తో సరిపెట్టుకుంటున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు ఆయిల్తో తయారుచేసే ఆహార పదార్థాల తయారీ నిలిపివేయగా, మరికొన్ని రేట్లు పెంచేశాయి. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల నుంచి గ్రామాల వరకు అనేక హోటళ్ల నుంచి రోడ్డుపై బండి వరకు నూనెధరల సాకుతో టిఫిన్ రేట్లు పెంచేశారు. దోసె, పూరీపై పది నుంచి పన్నెండు చొప్పున, ఇడ్లీపై అయిదు రూపాయల చొప్పున ధర పెంచేశాయి. నూనె ధరలు పెర గడంతో పెంపు తప్పలేదని బయట బోర్డులు ఏర్పాటు చేశాయి. ప్రముఖ హోటళ్లలోను అల్పాహార ధరలు పెరిగిపోయాయి.
తోపుడు బండ్లు, చిన్నచిన్న కాకాహోటళ్లలో గత నాలుగు రోజులు నుంచి టిఫిన్ రేట్లు పెంచినట్లు బోర్డులు ఏర్పాటుచేశాయి. గ్రామాల్లోను దోసె, పూరీ రేట్లు పెరిగాయి. కొన్ని హోటళ్లయితే ధరలు పెంచడానికి బదులు పూరీ, బజ్జీ వంటి ఎక్కువ నూనె వినియోగించే టిఫిన్ల విక్రయాలు నిలిపివేశాయి. కాకినాడ సుబ్బయ్య హోటల్ అయితే నూనె ధరలు సలసల మంటుండడంతో పూరీ అమ్మకాలు నిలిపి వేసింది. దోసెలు కూడా తగ్గించేసింది. కొన్ని రెస్టారెంట్లు చికెన్ స్టార్టర్ల రేట్లు కూడా పెంచి మెనూ ధరలు సవరించాయి. ఇదంతా ఒకెత్తయితే వంట నూనెల ధరలు ఇంకా పెరిగిపోతాయయనే భయంతో కొందరు ఎక్కువగా నూనె డబ్బాలు కొంటున్నారు. ఇదే అదనుగా పలువురు వ్యాపారులు బ్లాక్లో అమ్ముతున్నారు.
దీనిపై ఫిర్యాదులు భారీగా వస్తుండడంతో గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో అనేకచోట్ల ఆయిల్ వ్యాపా రాలపై విజిలెన్స్ అధికారులు దాడులు జరుపుతున్నారు. అటు యుద్ధం ప్రభావంతో నేడో, రేపో పెట్రో ధరలు కూడా భారీగా పెరగనున్నాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు రవాణా ఖర్చుల భారం పేరుతో నిత్యావసరాలు, పండ్ల ధరలు కూడా మరింత పెరిగి సామాన్యుడి నడ్డి విరగ్గొట్టనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.