news18-telugu
Updated: October 23, 2019, 7:25 PM IST
శ్రీశైలం నక్షత్ర వనంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ పూజలు
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ శ్రీశైలం శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మహా శక్తి యాగంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన.. రుద్రాభిషేకం, కుంకుమార్చన పూజల్లో పాల్గొన్నారు. స్వామి దర్శనానంతరం నూతనంగా నిర్మిస్తున్న నక్షత్ర వనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో మొక్కలు నాటారు. మోహన్ భగవత్కు ఆలయ ఈవో రామారావు స్వామి వారి జ్ఞాపిక, ప్రసాదాన్ని అందజేశారు. ఇదిలా ఉండగా, ఈ రోజు ఆలయ ప్రాంగణంలో జరిగిన హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.కోటి 81 లక్షలు అందాయి. వీటిలో అన్నదానం హుండీ ద్వారా రూ.6.65 లక్షలు లభించగా, వేరే హుండీల ద్వారా మిగతా సొమ్ము లభించింది. ఈ నగదుతో పాటు 162 గ్రాముల బంగారం, 2 కిలోల 950 గ్రాముల వెండి వచ్చింది.

శ్రీశైలం ఆలయ ప్రజాసంబంధాల శాఖ విడుదల చేసిన ప్రకటన
ఇక, 791 యూఎస్ డాలర్లు, ఒక చైనా యువాన్, ఒక మలేషియా రింగిట్స్, ఒక ఖత్తర్ రియాల్, 10 దిర్హామ్స్, ఒక కువైట్ దినార్, తదితర విదేశీ కరెన్సీ కూడా లభించిందని ఆలయన నిర్వాహకులు తెలిపారు. ఈ మొత్తం గత 27 రోజుల్లో భక్తులు సమర్పించిన విరాళాలు అని వెల్లడించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Published by:
Shravan Kumar Bommakanti
First published:
October 23, 2019, 7:25 PM IST