తెలంగాణ ప్రజలు గొడుగులు బయటకు తీసే సమయం మొదలైందని అనుకోవచ్చు. అప్పుడేనా అంటే... నిజమే... మే నెలలో తెలంగాణలో వర్షాలు తక్కువగానే కురుస్తాయి. కానీ ఈ సంవత్సరం వాతావరణం మారింది. ఇవాళ్టి (బుధవారం) నంచి వరుసగా 4 రోజుల పాటు అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు పడే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 48 గంటల్లో బంగాళాఖాతంలో అండమాన్ దగ్గర అల్పపీడనం ఏర్పడేలా ఉంది కాబట్టి... దాని ప్రభావం తెలంగాణ పైనా పడనుంది. ఐతే... ప్రస్తుతం తెలంగాణలో ఎండలు ఎక్కువగానే ఉన్నాయి. మెదక్లో మంగళవారం 42.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 41.2, హైదరాబాద్లో 37.6 డిగ్రీలు నమోదైంది. జనరల్గానే హైదరాబాద్ కాస్త చల్లగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంది. దానికి తోడు హైదరాబాద్లో మంగళవారం అక్కడక్కడా వర్షం కూడా పడింది.
ఇక ఏపీలోనూ వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయల సీమలో అక్కడక్కడా వానలు పడేలా కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దాని ప్రభావం వల్ల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలోకి వెళ్తుందని చెప్పారు. దానికి తోడు మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని విదర్భ పైనుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఒకటి కొనసాగుతోంది. దాని వల్ల అక్కడక్కడా మేఘాలు అలా అలా గాల్లో తేలుతూ... అటూ ఇటూ వెళ్తున్నాయి. ఇవన్నీ వర్షాలు పడేందుకు ఛాన్స్ ఇవ్వబోతున్నాయి. ఐతే... ప్రస్తుతానికి ఏపీలో ఎండలు దంచికొడుతున్నాయి. అదే సమయంలో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడుతున్నాయి.
మొత్తంగా ఈ సంవత్సరం ఎండల కంటే వానలు ఎక్కువగా కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా లాక్డౌన్ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో... రవాణా, ఫ్యాక్టరీలు మూతపడి... వాతావరణంలో వేడి కాలుష్యం తగ్గింది. అందువల్ల వాతావరణంలో కాస్త తేమ ఉండి... వర్షాకాలం త్వరగా మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Telangana, WEATHER