ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి (AP Government) ఉద్యోగులకు మధ్య పీఆర్సీ యుద్ధం మరింత ముదురుతోంది. మంగళవారం నుంచి ఉద్యమంలోకి దిగుతామని ప్రకటించిన ఉద్యోగులు వెనక్కి తగ్గేదేలేదని తేల్చిచెబుతున్నారు. ఇటీవల తిరుపతి పర్యటనలో మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని సీఎం జగన్ (AP CM YS Jagan) ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఐతే తమ డిమాండ్లన్నీ నెరవేర్చాలని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. గతంలో చెప్పిన విధంగా ఉద్యమ కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ట్రెజరీ ఉద్యోగులు మాత్రం ఉద్యమంలో పాల్గొనబోమని చెప్పడం సంచలనంగా మారింది. దీంతో ప్రభుత్వానికి అనుకూల, వ్యతిరేక వర్గాలుగా ఉద్యోగ సంఘాలు విడిపోయాయి. దీంతో పీఆర్సీ ఫైట్ మరింత రసవత్తరంగా మారింది. అటు ప్రభుత్వం కూడా ఉద్యోగుల విషయంలో సానుకూలంగా లేదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉద్యోగ సంఘాల నేతలు వరుస సమావశాలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళంలో ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు, కడపలో అమరావతి జేఏసీ నేత బొప్పరాజు సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం దృష్టికి 71 డిమాండ్లు తీసుకెళ్లామని.. కానీ ఇప్పటివరకు పీఆర్సీ నివేదికను బయటపెట్టలేదని బండి శ్రీనివాసరావు మండిపడ్డారు. అందుకే మంగళవారం నుంచి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తేల్చి స్పష్టం తేల్చారు. నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామన్న ఆయన.. ప్రాంతీయ సదస్సులను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తమ 71 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. 13 లక్షల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. రెండు ఉద్యోగ జేఏసీల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదని.. 11వ పీఆర్సీ అమలు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. ప్రతిసారి ఇస్తామంటున్న 7డీఏలు పెండింగ్ లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ, వైద్య ఖర్చుల రీయింబర్స్ మెంట్ విషయంలో తమ సమస్యలను వినే స్థితిలో ప్రభుత్వం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే తాము రోడ్లపైకి రావాల్సి వచ్చిందన్నారు. ఈ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు న్యాయం జరిగే పరిస్థితులు లేవని బొప్పరాజు ఆరోపించారు.
ఇదిలా ఉంటే తాము ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చిన నిరసనలో పాల్గొనబోమని ఏపీ ట్రెజరీ సర్వీసెస్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఇటీవలే సీఎం జగన్ పది రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చినందున ఆందోళనలకు దూరంగా ఉంటామని తెలిపింది.
మరోవైపు తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చగలమని జేఏసీ నేత బండి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఉద్యోగ సంఘాలు నడుపుతున్నారా..? రాజకీయ పార్టీ నడుపుతున్నారా..? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని కూల్చగలిగే శక్తి ఉంటే రాజకీయ పార్టీ పెట్టుకోవాలని సూచించారు. పీఆర్సీ ఇస్తామని సీఎం చెప్పిన తర్వాత కూడా ఆందోళన చేయడం సరికాదన్నారాయన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Employees