ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పీఆర్సీ వివాదం (PRC Issue) కొత్త మలుపుతిరిగింది. ఇన్నాళ్లూ ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగులుగా ఉన్న ఈ వ్యవహారం.. ఇప్పుడు ఉద్యోగులు వర్సెస్ ఉపాధ్యాయులుగా మారింది. పీఆర్సీ సాధన సమితి నేతల తీరుపై ఉపాధ్యాయులు చేస్తున్న విమర్శలకు ఉద్యోగ సంఘాల నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. క్రమంగా ఈ వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంటోంది. తమపై ఉపాధ్యాయ సంఘాలు చేస్తున్న ఆరోపణలపై పీఆర్సీ సాధనసమితి నేతలు స్పందించారు. తమ చర్చలు ఆమోదయోగ్యంగా లేకుంటే ఉపాధ్యాయ సంఘాలే ఈనెల 6 అర్ధరాత్రి నుంచి సమ్మె కొనసాగించాల్సిందని పీఆర్సీ సాధన సమితి నేలన్నారు. చర్చలపై సంతృప్తిగా లేకుంటే అప్పుడే చెప్పాల్సిందన్నారు. అంతేకాదు టీచర్ల వెనుక కొన్ని శక్తులు ఉండి నడిపిస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు.
సమ్మె జరగలేదనే ఫ్రస్ట్రేషన్ తోనే ఉపాధ్యాయ సంఘాలు తమపై విమర్శలు చేస్తున్నాయని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి అన్నారు. మంత్రుల కమిటీతో ఫిట్ మెంట్ పైనే ప్రధానంగా చర్చ జరిగిందని.. మంత్రులు క్లారిటీగా చెప్పునప్పుడే ఎందుకు స్పందించలేదని ఆయన ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ఫిట్ మెంట్ తప్ప అన్నీ సాధించుకోగలిగామని.. చర్చలప్పుడు సైలెంట్ గా ఉన్నవారు బయటకు వచ్చిన తర్వాత ఫోన్లు వస్తే వెళ్లిపోయారని.. ఆ తర్వాత విమర్శలు చేయడం మొదలుపెట్టారని వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు. సమ్మె చేయాలనే ఉత్సాహంతో ఉన్నవారు తమపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఆర్ధిక పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులను సంతృప్తి పరిచే ఫిట్ మెంట్ ఇవ్వలేమని ప్రభుత్వం చెప్పడంతోనే సమ్మె విరమణకు తాము అంగీకరించామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. వచ్చే ఏడాది మరో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంటుంటదని.. 2024 ఎన్నికల దృష్ట్యా మెరుగైన వేతనాలు సాధించుకునే అవకాశముందని పేర్కొన్నారు. తమ నిర్ణయాలతో విభేదించే ఉపాధ్యాయ సంఘాలు సొంత కార్యాచరణతో ముందుకెళ్లాలని సూచించారు. ఉపాధ్యాయుల వెనుక ఎదో ఉందనే అనుమానం కలుగుతోందని.. అందులో రాజకీయ ప్రమేయం ఉందని సూర్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతల ఇళ్ల వద్ద పోలీసుల సెక్యూరిటీ అవసరం లేదని.. ఉద్యోగులే తమకు రక్షణ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉంటే పీఆర్సీ సాధన సమితి నేతల వ్యాఖ్యలకు ఉపాధ్యాయ సంఘాలు ఘాటుగానే సమాధానమిచ్చాయి. తమ వెనుక రాజకీయ నేతలున్నారంటూ ప్రచారం సరికాదని.. ఫ్యాప్టో ఛైర్మన్ సుధీర్ బాబు అన్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలపై అసత్య ప్రచారం సరికాదని.. శవయాత్రలు, పిండ ప్రదానాలు చేయవద్దని టీచర్లకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలనే ఉద్దేశం తమకు లేదని.. ఫిట్ మెంట్, గ్రాట్యుటీలో తేడా రావడం వల్లే పీఆర్సీ సాధన సమితి నుంచి బయటకువచ్చామని స్పష్టం చేశారు. మీటింగ్ అటెండ్స్ లో మాత్రమే తాము సంతకం చేశామని.. కానీ ఒప్పందానికి మాత్రం అంగీకరించలేదన్నారు. బయోమెట్రిక్, పోలీసుల ఆంక్షలతో తమపై నిర్భందాలు విధించారని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధా కార్యదర్శి ప్రసాద్ విమర్శించారు. మొత్తానికి పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అమలు చేసిన వ్యూహం.. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మధ్య పెద్ద చిచ్చునే రగిల్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap government, Employees