AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతి వ్యూహాలతో దూకుడుగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. మరోవైపు అభ్యర్థులను సైతం ఫైనల్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇతర పార్టీల్లో ఉన్న కీలక నేతలపై ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్నాయి. గెలుపు గుర్రాలు అనుకుంటే.. తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. దీంతో ప్రస్తుతం వలసల సీజన్ మొదలైనట్టే కనిపిస్తోంది. ఈ ప్రభావం ఎక్కువగా అధికార వైసీపీ (YCP) పైనే కనిపించే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మరో వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) పార్టీ మారుతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ (Maddishetti Venugopal) వైసీపీని వీడుతారా..? ఎందుకు వీడుతున్నారు..? ఏ పార్టీలోకి వెళ్తున్నారు? ఈ ప్రశ్నలు నియోజకవర్గంలో హోరెత్తాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి ఆయనే క్లారిటీ ఇచ్చారు..
తనపై వస్తున్న ప్రచారం పెరగడంతో ఆయనే నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. తాను ఇప్పటికే కాదు ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని స్పష్టం చేశారు.. జీవితాంతం జగన్కు మద్దతుగానే ఉంటానన్నారు. దర్శిలో జగన్కు మద్దతుగా నిలబడి ఎన్నికల్లో గెలిచానన్నారు. తనకున్న అవకాశాలన్నింటిని ఉపయోగించుకుంటూ నియోజకవర్గ ప్రజలకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తానన్నారు.
రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని.. అదే విషయం తాము గడప గడపకు వెళ్తున్నప్పుడు కనిపిస్తోంది అన్నారు. అయితే తాను కార్యకర్తలకు దూరంగా ఉన్నాను అంటూ ప్రచారం జరుగుతోందని.. కేవలం తన కొడుకు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న కారణంగానే కార్యకర్తలకు దూరంగా ఉన్నానని వివరణ ఇచ్చారు. తన ప్రత్యర్థులు.. ఈ విషయాన్నే భూతద్దంలో చూపించి.. పార్టీ మారుతున్నారనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : అధికార వైసీపీకి బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్ బై.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..?
వచ్చే ఎన్నికల్లో జిల్లాలో వైసీపీదే ఘన విజయం అన్నారు. అందులో ముందుగా వైసీపీ గెలిచే సీటు దర్శినే అన్నారు. దర్శి పట్టణంలో మంచినీటి సమస్య కూడా వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తాను అన్నారు. ప్రతీ ఇంటికి తాగునీరు అందిస్తామని హామీనిచ్చారు ఆ హామీని నిలబెట్టుకుంటాను అన్నారు. తన ప్రత్యర్థులు చేసే అసత్య ఆరోపణలు ఎవరూ నమ్మొద్దని కార్యకర్తలను కోరారు. కానీ స్థానిక వైసీపీ వర్గాల్లో మాత్రం ఇదే అవశంపై జోరుగా చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, AP News, AP Politics, Ycp