Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
వారంతా చిన్న సన్నకారు రైతులు. పొలంలో కష్టపడితేనే లాభాలు చూసేది. సమయానికి నీరందితేనే పంటలు పండేది. ఐతే 40ఏళ్లుగా వారిని ఓ సమస్య పట్టపీడిస్తోంది. ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా.. నేతల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఇక చేసేది లేక వారే స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు సినిమాను ఆదర్శంగా చేసుకుని 40 ఏళ్లలో ప్రభుత్వం చేయలేని పనిని.. రైతులే చేయి చేయి కలిపి పూర్తి చేశారు. తమ స్తోమతకు తగ్గట్టుగా చందాలు వేసుకొని 20 లక్షలు పోగుచేసి గుళ్ళకమ్మ వాగుపై చప్టా నిర్మాణానికి నడుం కట్టారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం కురిచేడు మండలాల్లోని సరిహద్దు గ్రామాల మధ్య గుళ్ళకమ్మ వాగు ఉంది. వర్షకాలం వస్తే అటు ఇటు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఈ వాగుపై వంతెన నిర్మించాలంటూ 40 ఏళ్ళ నుండి స్థానికులు.. అధికారులు, ప్రజాప్రతినిథుల చుట్టూ తిరుగుతున్నారు. ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా, మొత్తుకున్నాఏ ప్రభుత్వమూ స్పందించలేదు.
ప్రతి ఏటా వాగు పొంగినప్పుడు ఇక్కడ గ్రామాల ప్రజల కష్టాలు వర్ణనాతీతం. ఆస్పత్రికి వెళ్లాలన్నా ప్రాణాలు తెగించాల్సిందే. రోజువారీ పనుల నిమిత్తం వెళ్లేవారు కూడా ఏడాదికి దాదాపు 9 నెలల పాటు కష్టాలు పడాల్సి వచ్చేది. ఏడాదిలో సగానికి పైగా వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు. ఇత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఇక పాలకులను నమ్మి లాభం లేదని స్థానికులంతా భావించారు. వంతెన లేక ఇబ్బంది పడుతున్న ముడివేముల, ఒడ్డుపాలెం, పాపనపాలెం, మేడపి కురిచేడు మండలంలోని గంగారం, నాయుడుపాలెంలోని రైతులంతా కలిసి చందాలు నలూవు తేలి రూ.20 లక్షలు పోగు చేశారు.
వెంటనే రంగంలోకి దిగి వంతెనకు ప్లాన్ రూపొందించారు. సామాగ్రిని తెప్పించి కేవలం నెలరోజుల్లోనే పూర్తి చేసి ప్రారంభించారు. ఈ వంతెన కోసం చుట్టుపక్కల గ్రామాలకు చెందిల రైతులు, ప్రజలు చేయి చేయి కలిపామని.. ఇందులో ప్రజాప్రతినిథులు, ప్రభుత్వాల ప్రమేయం లేదని స్థానికులు చెబుతున్నారు.
వంతెన నిర్మాణానికి సంబందించిన ప్లాన్, ప్రదేశం గురించి చర్చ జరిగ్గా.. మండల ఇంజనీరింగ్ అధికారుల సలహా తీసుకుందామన్న ప్రతిపాదన వచ్చింది. ఐతే మళ్లీ ప్రభుత్వం దగ్గరకు వెళ్తే.. అనుమతులు, నిధులు అంటూ కొర్రీలు పెడతారని భావించి నూజెండ్ల మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన గుజ్జా వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి ఈ వంతెన నిర్మాణం బాధ్యత అప్పగించారు. ఈయన చదివింది 5వ తరగతి మాత్రమే ఈయన గతంలో ఒక కాంట్రాక్టర్ వద్ద నిర్మాణ పరిశీలకుడిగా పనిచేసిన అనుభవంతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయించారు.
వాగుపై వంతెన లేకపోవడంతో తిరిగి వెళ్లాలంటే దాదాపు 40 కిలోమీటర్లు పడుతుందని.. చప్టా పూర్తి కావడంతో ఇప్పుడు 20 కిలోమీటర్ల దూరం తగ్గిందని స్థానికులు చెబుతున్నారు. ఈ చప్టా వల్ల రెండు మండలాల గ్రామాల ప్రజలకే కాకుండా పక్క మండలాల వారికి ప్రయోజనం చేకూరిందంటున్నారు. ప్రజలే స్వచ్ఛందంగా వంతెన పూర్తి చేయడంతో ప్రభుత్వానికి చెంపపెట్టులా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Prakasham dist