పులి అంటేనే భయపడతాం. పులి ఎక్కడో ఉందంటేనే.. ఇక్కడ మనం గజగజ వణుకుతాం. అలాంటిది ఓ పులిని చంపి తినేశారు. చక్కగా కూర వండుకొని భుజించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District)లో చోటు చేసుకుంది. ఈ నెల 10న ఎర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ అధికారి నీలకంఠేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అటవీ సిబ్బంది ఆడపులి పాద ముద్రలను గుర్తించారు. దీంతో పులి ఆచూకీని తెలుసుకునేందుకు అదే రోజు ట్రాప్ కెమెరాలు అమర్చారు. అలాగే పులి సంచారం గురించి ప్రజలకు కూడా అలర్ట్ చేశారు. సమీప ప్రాంతాల ప్రజలు ఎవరు కూడా ఆరు బయట ఎవరూ నిద్రపోవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాదు... విద్యుత్ సరఫరా (Power supply)ను నిలిపివేశారు.
అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పంటలను కాపాడుకునేందుకు పొలం చుట్టూ రైతులు వేసిన విద్యుత్ కంచె తగిలి పులి మరణించింది. అయితే దీన్ని గమనించిన కొందరు గ్రామస్థులు.. చనిపోయిన పులిని ఇంటికి తీసుకెళ్లారు. అంతేకాదు పులి మాంసాన్ని వండుకుని తినేసినట్టు ప్రచారం జరుగుతోంది. పులిగోళ్ల పంపకాల విషయంలో వారి మధ్య తేడాలు రావడంతో అసలు విషయం బయటపడింది. అలాగే పులి మాంసాన్ని వండుకున్న వారంతా దాని చర్మాన్ని సమీపంలోని బావిలో పడేసినట్టు అనుమానిస్తున్నారు.
దీనికి సంబంధించి సమాచారం అందుకున్న ఫారెస్ట్ సిబ్బంది (Forest staff).. పులి మాంసాన్ని వండుకుని తిన్నట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 12మంది గ్రామస్థుల్ని గుర్తించినట్టు సమాచారం. మూడు రోజుల క్రితం వీరిలో ఇద్దరిని ఎర్రగొండపాలెంలోని కార్యాలయానికి పిలిపించి రహస్యంగా విచారించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాపం చనిపోయిన తల్లి కోసం రెండు పులి కూనలు అల్లాడుతున్నాయి. తల్లి కోసంవెతుకుతూ.. ఆ పులి పిల్లలు ట్రాప్ కెమెరాలకు చిక్కాయి. ఇప్పుడు ఈ ఘటన అంతటా చర్చనీయంశం అయ్యింది. పులిని తినేయడం ఏంటని పలువురు ఆశ్చర్యపోతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Prakasham dist, Tiger, Tiger Attack