Shaik Salam, News18, Ongole
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పేదలకు వైద్యం అందించేందుకు ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకాన్ని (Arogya Sri Scheme) అమలు చేస్తోంది. ఈ పథకం కింద కార్డుదారులంతా నెట్ వర్క్ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది మందికి ఈ పథకం అందుబాటులో ఉంది. ఐతే ఆరోగ్య శ్రీపై చికిత్స చేసేందుకు కొన్ని ఆస్పత్రులు కొర్రీలు పెడుతుంటాయి. ఆరోగ్య శ్రీ వర్తించే అవకాశమున్నా వర్తించదంటూ ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. అలాంటి ఘటనలపై ఆరోగ్య శ్రీ అధకారులు క్లారిటీ ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తింపులో కార్పొరేట్ వైద్యశాలలు నిర్లక్ష్యం వహిస్తే జరిమానా విధించేందుకు కానీ , లేక ఆరోగ్యశ్రీ ప్యానల్ లో నుండి వైద్యశాలలను తొలగించేందుకు కూడా వెనుకాడబోమని ఆరోగ్యశ్రీ రాష్ట్ర ప్రత్యేక అధికారి డాక్టర్ యాదాల అశోక్ బాబు అన్నారు.
ఒంగోలులో న్యూస్ 18 నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో 1059 వ్యాధులు ఆరోగ్యశ్రీ లో చికిత్స అందించగా, ప్రస్తుతం సీఎం వైఎస్ జగన్ ఆధ్వర్యంలో 3225 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నారన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపుకు ఏ వైద్యశాలైనా, రోగులకు ఇబ్బంది కలిగిస్తే వారు రోగుల వద్ద వసూలు చేసిన నగదుకు 10రెట్లు జరిమానా విధిస్తామన్నారు.
ఇదే పద్ధతి సదరు కార్పొరేట్ వైద్యశాల కొనసాగిస్తే చివరగా ఆరోగ్యశ్రీ ఎంపానిమెంట్ లో కూడా తొలగిస్తామన్నారు. పేద రోగులకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడమే లక్ష్యం గా ఎంచుకున్న సీఎం జగన్ నైజానికి అనుగుణంగా, తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తున్నట్లు, ఇప్పటికే పలు కార్పొరేట్ వైద్యశాలలపై ఫిర్యాదులు అందిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించామన్నారు. రోగులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపులో ఏవైనా సమస్యలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 104 కు సమాచారం ఇవ్వవచ్చన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aarogyasri, Andhra Pradesh, Local News, Prakasham dist