Crime News: రోజు రోజుకూ టెక్నాలజీ పెరుగుతోంది. భయంకరమైన మహమ్మారిలను సైతం ఓడిస్తున్నాం.. కరోనాకు విరుగుడు కన్నుకున్నాం.. అనితర సాధ్యమైన విషయాలను కూడా కనిపెట్టేస్తున్నారు. ఆకాశంలోనూ అద్భుతాలు చేస్తున్నారు. ఇలాంటి రోజుల్లోనూ కొందరు మూఢ నమ్మకాలను వీడడం లేదు. ఓ పక్క శాస్త్రసాంకేతిక విజ్ఞానం అభవృద్ధి పథంలో దూసుకుపోతోందని ఢంకా బజాయించి చెప్పుకుంటున్నాం. కానీ మరో వైపు పల్లెల్లో నెత్తుటిఏరులు పారిస్తున్నాయి మూఢనమ్మకాలు. ఈ మాయదారి నమ్మకాల కారణంగా మనుషులు మానవత్వాన్ని మరిచిపోతున్నారు. సొంత వారి ప్రాణాలు సైతం తీసేస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఇలాంటి నేరల సంఖ్య పెరుగుతోంది. క్షుద్రపూజల పేరుతో హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా (Prakasam District)లో దారుణం జరిగింది. క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానం ముగ్గురిని ప్రాణాలను బలి తీసుకుంది. కేవలం చేతబడి చేశారు అనే చిన్న అనుమానం.. ఓ యువకుడుని నరరూప రాక్షసుడిగా మారేలా చేసింది. ఓ స్వామిజీ చెప్పిన మాటలు నమ్మి.. సొంత బాబాయ్ కుటుంబంలోని ముగ్గురిని దారుణంగా కొట్టి చంపాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలో చోటుచేసుకుంది.
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామానికి (Kothapalli Village) చెందిన కుక్క మల్లికార్జున యాదవ్.. తన సొంత బాబాయ్ తిరుమలయ్య తనపై చేత బడులు చేస్తున్నాడని అనుమానించాడు. క్షుద్ర పూజలు చేస్తూ తన ఎదుగుదలను అడ్డుకుంటున్నాడని గత కొంతకాలంగా అనుమానిస్తున్నాడు. ఆ విషయం ఓ స్వామిజీ చెప్పడంతో అప్పటి నుంచి అదే నమ్ముతూ వస్తున్నాడు. ఆ స్వామిజీ చెప్పిన మాటలకు ప్రభావితుడైన మల్లికార్జున.. సొంత బాబాయ్, ఆయన కుటుంబ సభ్యులపై ఈ నెల 12వ తేదీన రాళ్లతో దాడి చేశాడు.
మల్లికార్జున చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన తిరుమలయ్య భార్య ఈశ్వరమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. తిరుమలయ్యతోపాటు ఆయన కుమార్తె స్వప్న తీవ్రంగా గాయపడ్డారు. కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తిరుమలయ్య చనిపోగా, గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 9 రోజుల తర్వాత స్వప్న మృతి చెందారు. అయితే స్వప్న 6 నెలల గర్భవతి.. ఈ భూమి మీద కాలు పెట్టకుండానే పసి బిడ్డకు నూరేళ్లు నిండిపోయాయి. తొమ్మిది రోజులపాటు వైద్యులు చికిత్స అందించినా స్వప్న పరిస్థితులు ఎటువంటి మార్పు కనిపించలేదు. స్వప్న ఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. దాడిలో స్వప్న గర్భంలోని పిండం చనిపోయిందని వైద్యులు తెలిపారు. ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ.. ప్రాణాలు నిలబడలేదన్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇదీ చదవండి : బాబోయ్ బాహుబలికి బాబులా ఉంది..? ఇలాంటిది ఎప్పుడూ చూసి ఉండరు..?
సొంత బాబాయ్ కుటుంబాన్ని హతమార్చిన తర్వాత మల్లికార్జున యాదవ్ కనిపించకుండా పోయాడు. గిద్దలూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. మల్లికార్జున కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ఓ స్వామీజీ చెప్పిన మాటలు నమ్మే.. మల్లికార్జున ఇలాంటి దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Prakasam