జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. టీటీడీలో 1400 మంది కార్మికులను తొలగిస్తూ ఇటీవల బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనిపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. దేశంలోనే అత్యంత సంపన్న ధార్మిక సంస్థ అయిన టీటీడీ 15 సంవత్సరాలుగా ఔట్ సోర్సింగ్లో పనిచేస్తున్న 1400 మంది కార్మికులను తొలగించడం మీద విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా టీటీడీ వైఖరిని తప్పుపట్టారు. కార్మికుల పొట్ట కొట్టొద్దని సూచించారు. ఓ వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్యోగులను తొలగించొద్దని, వేతనాలు కూడా ఇవ్వాలని పిలుపునిస్తుంటే, మరోవైపు టీటీడీనే నమ్ముకుని పనిచేస్తున్న 1400 మందిని తీసేయడం సమంజసం కాదని అన్నారు. వివిధ వర్గాల నుంచి విమర్శల నేపథ్యంలో టీటీడీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఔట్ సోర్సింగ్ కార్మికులను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఒకరు లేఖ ద్వారా పవన్ కళ్యాణ్కు తెలిపారు. దీంతో టీటీడీ నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ అభినందించారు. టీటీడీ పాలకవర్గం, అధికారులు మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్న అందరికీ అభినందనలు తెలిపారు.
Published by:Ashok Kumar Bonepalli
First published:May 03, 2020, 16:34 IST