వైఎస్సార్సీపీ (YSRCP) అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల ఆత్మహత్యలు (Farmers Suicide) పెరిగాయని.. సీఎం సొంత జిల్లా ఒక్క కడప (Kadapa)లోనే 175 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ జనసేన (Janasena) సంచనల ఆరోపణ చేసింది. కౌలు రైతుల ఆత్మహత్యలను కరోనా నెపంతో బయటకు రాకుండా దాచారంటూ ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) అన్నారు. కేవలం బటన్ నొక్కితేనే బ్రహ్మాండంగా సంక్షేమం జరిగిపోతుందని చెబుతూ జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారంటూ ఆయన విమర్శించారు. ఈ నెల 21న ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి పార్టీ తరఫున రూ.లక్ష ఆర్థిక సాయం చేసేందుకే పవన్ కల్యాణ్ ఉమ్మడి కడప జిల్లాలో పర్యటిస్తున్నట్లు నాదెండ్ల వెల్లడించారు.
ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటంలో జరిగే సభ ద్వారా రైతు కుటుంబాల్లో పవన్ కల్యాణ్ భరోసా నింపుతారని నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం కడపలో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటంలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. వేదిక ఏర్పాటు తదితర అంశాలపై సలహాలు సూచనలు ఇచ్చారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు.
"ముఖ్యమంత్రి, అధికార పార్టీ నేతలు బటన్ నొక్కి అందరి ఖాతాల్లోకి డబ్బు వెళ్లిపోతోంది.. ఇంతకంటే సంక్షేమం చేసే ప్రభుత్వం ఈ దేశంలో లేదని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతాంగానికి భరోసా కల్పించే విధంగా ఎవ్వరూ పని చేయడం లేదు. పాలకులు గాని, యంత్రాంగం గాని ఎవరి పని వారు చేసి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయన్నప్పుడు రైతులకు గిట్టుబాటు వచ్చేలా చేసి, ముఖ్యమంత్రి క్షేత్ర స్థాయిలో పర్యటించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. రైతాంగాన్ని కులాల వారీగా విడగొట్టడం ఏంటి? రైతుకు కులాలు అంటగట్టడం ఏంటి? నష్టం జరిగితే ఒక ప్రాంతం మొత్తం నష్టం వాటిల్లుతుంది. అన్ని కులాల వారికీ నష్టం జరుగుతుంది. ఈ ప్రభుత్వ తీరు సరికాదు. రైతు భరోసా కేంద్రాల్లో జరిగిన అవినీతి మాములు అవినీతి కాదు. రూ. 6,300 కోట్ల ఖర్చు చేశారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందించింది లేదు. పరిహారం ఇచ్చే చోట కూడా సమాజాన్ని విభజించి పాలిస్తున్నారని" విమర్శించారు.
బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా పవన్ కళ్యాణ్ కౌలు రైతులను ఆదుకునేందుకు శ్రీకారం చుట్టారని నాదెండ్ల అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం చేసే విధంగా కార్యక్రమాన్ని రూపొందించినట్లు వివరించారు. కార్యక్రమం ప్రారంభించినప్పుడు 600 మంది వరకు బాధితులు ఉంటారని భావించామని.. ఇక్కడ పరిస్థితి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2900 మంది ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు. కడప జిల్లాలో సింహభాగం.. అంటే 46 మంది ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలో ఆత్మహత్యకు పాల్పడ్డారని నాదెండ్ల ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 607 మందికి జనసేన పార్టీ తరఫున ఆర్ధిక సాయం అందించామని వివరించారు.
"జనసేన పార్టీ అధికారం చేపట్టిన తర్వాత రైతాంగానికి భరోసా నింపే ప్రభుత్వంగా ఉండేవిధంగా ఆలోచన చేస్తుంది. క్షేత్ర స్థాయిలో రైతులు ఆనందించే విధంగా కార్యక్రమాలు చేపడతాం. గతంలో మదనపల్లిలో టమాటా రైతుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి అండగా నిలిచారు. ధాన్యం బకాయిలు పేరుకుపోయినప్పుడు మండపేట, కాకినాడల్లో రైతులకు అండగా కార్యక్రమాలు చేపట్టాం. నివర్ తుఫానుతో రైతాంగం నష్టపోతే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎకరాకి రూ. 25 వేల ఆర్ధిక సాయం అందించాలని పోరాటం చేశారు. రైతు భరోసా యాత్ర కోసం శనివారం ఉదయం కడప విమానాశ్రయానికి పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. ఒంటి గంటకు సిద్ధవటం చేరుకుని రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు" అని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmers suicide, Kadapa, Pawan kalyan, Ys jagan