రాష్ట్ర మంత్రి (AP Minister) అంటే చుట్టూ మంది మార్బలం... ఎక్కడికెళ్లినా గౌరవమర్యాదలు, హంగు ఆర్భాటాల ఉంటాయి. రాష్ట్రస్థాయిలో మంత్రి పదవి అంటే అన్ని పనులు నేరుగా పర్యవేక్షించే తీరిక ఉండదు. అందుకనే ఆయనకు ఓఎస్డీ, పీఏ, పీఎస్, అడిషనల్ పీఎస్, పీఆర్వో, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. వీళ్లందరికీ వారి హోదాను, బాధ్యతలను బట్టి గౌరవ మర్యాదలు దక్కుతాయి. మంత్రిగారితో ఏపని చేయించుకోవాలన్నా వీళ్లే ముఖ్యం. ఒకరు ఫైళ్ల క్లియరెన్స్, కీలక అంశాల్లో మంత్రిగారికి చేదోడువాదోడుగా ఉంటే.. కొందరు పబ్లిసిటీ, పర్యటనలు, ఇతర వ్యవహారాలు చూస్తారు. ఇక మంత్రిగారి పీఏ అంటే ఆ మర్యాదే వేరు. మంత్రి అంటే పీఏ.. పీఏ అంటే మంత్రి అనేలా ఉంటుంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గం (AP Cabinet) లోని ఓ మంత్రిగారి పీఏ మాత్రం ఏకంగా తానే మంత్రిలా వ్యవహరిస్తున్నారంట. కేబినెట్ లో ఐదు కీలక శాఖలు చూస్తున్న ఆ మంత్రిగారు ఉన్నత విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు కావడంతో పూర్తిస్థాయి పొలిటీషియన్ గా ఉండలేరన్న పేరుంది. ప్రతిపనిలోనూ ప్రొఫెషనల్ గానే ఉంటారు. అవితీని ఆరోణలు కూడా పెద్దగా లేవు. ఏ పనికన్నా రికమండ్ చేయాలంటే అర్హత ఉంటేనే చేస్తారు అనే పేరుంది ఆయనగారికి. కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ల వల్ల మంత్రికి చెడ్డపేరు వస్తోందనే ప్రచారం సాగుతోంది. అసలే త్వరలో కేబినెట్ లో మార్పులుంటాయన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మంత్రిగారి పీఏ వ్యవహారం ఆయన్ను ఇబ్బందిపెట్టేలా మారిపోయిందని సచివాలయంలో టాక్.
మంత్రికి పీఏ ఉండటం కామన్.. కానీ పీఏకి పీఏ ఎక్కడైనా ఉంటాడా..? కానీ ఆ మంత్రి పీఏకి మాత్రం అది సాధ్యమైంది. మంచి జీతం ఇచ్చిమరీ ఆ పీఏ మరో పీఏని నియమించుకున్నారంటే.. మంత్రికి తెలియకుండా ఎలాంటి దందా నడిపిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. మంత్రి బిజీగా ఉంటే ఆయన పనులు చక్కబెట్టాల్సిన వాడు.. తన పనులు చక్కబెట్టేందుకు మరో వ్యక్తిని నియమించుకోవడం అంటే ఇది మామూలు చిలక్కొట్టుడు కాదని ఆ మంత్రిగారి పేషీలో చర్చ జరుగుతోందట. ఖర్చు లేకుండానే బిల్లులు తయారు చేసి డ్రా చేసుకోవడం, పీఏగారి ట్యాక్స్ తగ్గించడమే ఆ చిన్న పీఏ జాబ్. మంత్రి ఓఎస్డీ వేరే బాధ్యతలకు వెళ్లడంతో తాను ఏం చేసినా అడిగేవారే లెేరన్నట్లుగా మారిపోయింది ఆ పీఏ తీరు.
వీళ్ల ఆగడాలతో మంత్రికి చెడ్డపేరొస్తుందని తెలిసి కూడా ఏడాదిన్నరగా అడ్డూ అదుపులేకుండా దందా సాగిస్తున్నారట. అందర్నీ మేనేజ్ చేస్తూ తమ పబ్బం గడుపుకుంటున్నారని మంత్రి శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ తెలిసినా వీళ్లు మాత్రం చీమకుట్టినట్లైనా లేదట. అంతేకాదు మంత్రికి తెలియకుండా స్పెషల్ క్యాంప్ ఆఫీస్ కూడా తెరిచి మరీ తమ పని కానిస్తున్నారట. పైసలివ్వనిదే ఫైలు కాదు కదా.. కనీసం ఫోన్ కాల్ కూడా చేయరు. వీళ్ల వ్యవహారంపై మంత్రికి ఉప్పందినా చూసీచూడకుండా వదిలేయడంతో తమకు అడ్డులేదని భావిస్తూ అందరి మీద పెత్తనం చెలాయించడం మొదలెట్టేశారట.
ఎవరైనా గట్టిగా అడిగినా, ప్రశ్నించినా టార్గెట్ చేస్తూ బిల్లులు, ఫైళ్ళు ఆపేస్తారనే ఆరోపణలున్నాయి. వీళ్ల చేసే దందాలు, దండుకోవడాలు మంత్రిగారి దగ్గరకు చేరినా ఆయన మందలింపుతో ఓ రెండు రోజులు సైలెంట్ అయినా.. ఆ తర్వాత షరా మామూలేనట. వీళ్ల దందా గరించి ఐఏఎస్ అధికారులకు తెలిసి చులకనైనా.. కాసుల కక్కుర్తికి అడ్డుకట్ట పడలేదు. సరికదా తమ గురించి లీకులిస్తారా అంటే కిందస్థాయి సిబ్బందిపై ఎక్కడం మొదలుపెట్టారట. ఈ ఆగడాలపై సంబంధిత మంత్రి స్పందించి యాక్షన్ తీసుకోకుంటే.. ఆయనకు పదవీ గండంతో పాటు అవినీతి మచ్చకూడా అంటుకోవడం ఖాయమన్న చర్చ జరుగుతోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.