గుంటూరు జిల్లా పులిచింతల ప్రాజెక్టులో సాంకేతిక సమస్య ఏర్పడింది. నీటి ఒత్తిడి కారణంగా ఒక గేట్ విరిగి పడిపోయింది. 16వ నెంబర్ గేట్ విరిగిపోవడంతో వరద నీరు వృథాగా పోతోంది. గురువారం తెల్లవారజామున ఈ ఘటన చోటుచేసుకుంది. ఎగువ నుంచి వరద నీరు వస్తుండడంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే క్రమంలో ప్రమాదవశాత్తు గేటు విరిగిపడింది. వెల్డింగ్ ఊడిపోవడంతోనే గేటు విరిగినట్లు తెలుస్తోంది. దాదాపు లక్ష క్యూసెక్కుల నీరు వృథా పోతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రాజెక్టుపై నీటి ఒత్తిడి తగ్గించేందుకు 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గేటు విరిగి పడిపోయినందున.. భారీగా నీరు వృథా అవుతోంది. ఏం చేయలో తెలియక తలలు పట్టుకున్నారు.
ఎమర్జెన్సీ గేటు ఏర్పాటుకు ప్రయత్నించినప్పటికీ.. వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అది సాధ్యం కావడం లేదు. సమస్యను పరిష్కరించేందుకు డ్యామ్ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తతున్నారు. గేటు విరిగిపడడంతో ముందుజాగ్రత్తగా ప్రాజెక్టుపైకి రాకపోకలను నిలిపివేశారు. డ్యామ్ వద్ద సెక్యూరిటీని పెంచారు. ఎగువ నుంచి భారీగా వరద నీరు తరలి వస్తుండడంతో.. పులిచింతల ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. పులిచింతలకు ప్రస్తుతం 2,12,992 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు ఉండగా, ప్రస్తుతం 172.76 అడుగులు ఉంది. పులిచింతల పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 42.34 టీఎంసీలుగా ఉంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇవి కూడా చదవండి:
Water Project: తెలుగు ప్రాజెక్టుల స్వాధీన ప్రక్రియ ప్రారంభం..
Minster Kodali Nani: మంత్రి కొడాలి నాని ఎందుకు సైలెంట్ అయ్యారు..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.