ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన చిత్తూరు జిల్లాలోని కాణిపాకం స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి ఓ భక్తులు భారీ విరాళం ఇచ్చారు. ఆలయ పునర్నిర్మాణానికి ఎన్నారై భక్తుడు ఏకంగా రూ.7 కోట్ల విరాళాన్ని అందజేశారు. ఆలయ ఈవో వెంకటేష్ కు చెక్కును అందజేశారు. కాణిపాక ఆలయం పునర్నిర్మాణానికి రూ.8.75 కోట్ల ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఐతే ఈ విషయం తెలుసుకున్న భక్తుడు ఆ మొత్తం తానే ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు మొదటి విడతగా రూ.7 కోట్లు అందజేశారు. మిగతా మొత్తం త్వరలోనే అందజేయనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కాణిపాకం ఆలయానికి వచ్చిన దాతకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు.
అనంతరం తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. ఐతే విరాళం ఇచ్చిన ఎన్ఆర్ఐ తన పేరు వెల్లడించేందుకు నిరాకరించారు. స్వామివారికి భక్తితో సమర్పించిన కానుకకి ప్రచారం అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఆలయ అధికారులు కూడా దాత వివరాలను గోప్యంగా ఉంచారు. త్వరలోనే ఆలయానికి సబంధించిన పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామని ఈవో తెలిపారు.
మరోవైపు శుక్రవారి తిరుమల శ్రీవారికి ఢిల్లీకి చెందిన భక్తుడు భారీ విరాళమిచ్చారు. పాస్కో సంస్థ సీఈవో సంజయ్ పస్సి, శాలినీ పస్సి దంపతులు టీటీడీకి రూ.10కోట్ల విరాళం అందించారు. ఈ మేరకు డీడీలను శ్రీవారి ఆలయ సమీపంలోని శ్రీరంగనాయక మండపంలో టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఇందులో శ్రీవెంకటేశ్వర భక్తి చానల్ కు రూ.9 కోట్లు సర్వశ్రేయస్సు ట్రస్టుకు రూ.కోటి అందజేశారు.
ఇటీవలే తిరుమల శ్రీవారికి తమిళనాడుకు చెందిన భక్తుడు రెండు కోట్ల రూపాయల విలువైన శంఖు, చక్రాలను విరాళంగా ఇచ్చి భక్తి చాటుకున్నాడు. తేనెకు చెందిన స్వామివారి భక్తుడు తంగదొరై మూడున్నర కిలోల బంగారంతో శ్రీవారికి శంఖు, చక్రాలు చేయించారు. ఇందుకోసం రెండు కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు చెప్పారు. కాగా, తంగదొరై గతంలోనూ శ్రీవారికి బంగారు, వజ్రాభరణాలను విరాళంగా ఇచ్చారు. అందులో బంగారు కటి, వరద హస్తాలు, వడ్డాణం, వజ్రాభరణాలు ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Andhra pradesh news, AP News, Chittoor, Telugu news, Tirumala, Tirumala tirupati devasthanam, Tirupati