వైఎస్ జగన్పై కత్తిదాడి కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. కేంద్రం ఇప్పటికే NIA (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ)కి కేసును అప్పగించిందని ఏపీ హైకోర్టు వెల్లడించింది. జగన్పై దాడి కేసును NIAకి అప్పగించాలని గతంలో దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కీలక విషయాన్ని వెల్లడించింది కోర్టు. కేసు దర్యాప్తును డిసెంబరు 31నే NIAకి కేంద్రం బదలాయించిందని స్పష్టంచేసింది. అనంతరం కేసును ముగించింది.
అక్టోబరు 25న విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. ఎయిర్ పోర్ట్ లాంజ్లో ఎదురుచూస్తున్న సమయంలో జగన్పై వెయిటర్ శ్రీనివాస్ కత్తితో దాడి చేశారు. సెల్ఫీ దిగేందుకు దగ్గరకొచ్చిన శ్రీనివాస్.. కోడి పందేలు వాడే కత్తితో జగన్పై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది. జగన్పై దాడి కేసును ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారిస్తోంది. నిందితుడు శ్రీనివాసరావు విశాఖ జైలులో ఉన్నాడు.
కాగా, జగన్పై దాడి ఘటన గత ఏడాది ఏపీ రాజకీయాలను కుదిపేసింది. టీడీపీ, వైసీపీ మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. జగన్ను చంపేందుకు టీడీపీ నేతలు కుట్ర చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తే.. సానుభూతి కోసమే జగన్ దాడి తనపై చేయించుకున్నాడని టీడీపీ తిప్పికొట్టింది. ఐతే పోలీసులు, సిట్ మాత్రం.. పబ్లిసిటీ కోసమే జగన్పై శ్రీనివాసరావు దాడి చేశారని చెప్పారు. ఈ క్రమంలో కేసు కేంద్రం దర్యాప్తు సంస్థకు బదిలీకావడం కీలక పరిణామంగా చెబుతున్నారు న్యాయ నిపుణులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, High Court, Ys jagan