ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కొత్తగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు మంగళవారం ప్రమాణస్వీకారాలు చేశారు. అధికార వైసీపీ (YSRCP) తరఫున ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు ఎమ్మెల్సీలు చిన్న గోవిందరెడ్డి, ఇసాక్ బాషా, పాలవలస విక్రాంత్ వర్మలు ఎమ్మెల్సీలుగా ప్రమాణాలు చేశారు. ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కొత్త ఎమ్మెల్సీల చేత ప్రమాణాలు చేయించారు. కొత్త సభ్యుల రాకతో మండలిలో అధికార వైసీపీ బలం 21కి పెరిగింది. అటు ఏపీ అసెంబ్లీలో (AP Assembly)నూ మండలిపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఏపీ అసెంబ్లీలో 151 మందితో తిరుగులేని బలమున్న వైసీపీకి మొన్నటిదాకా మండలిలో చిక్కులు ఎదురైన సంగతి తెలిసిందే. పాత టీడీపీ సభ్యుల గడువు ముగియడంతో స్వల్ప వ్యవధిలోనే 14 మంది కొత్త ఎమ్మెల్సీలు సభలోకి ఎంటరవుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణాలు చేశారు. ఈనెలాఖరులోగా మరో 11 మంది ఎమ్మెల్సీలు.. స్థానిక సంస్థల కోటా నుంచి, అదికూడా వైసీపీ నుంచే సభలోకి అడుగుపెట్టనున్నారు. ఆయా జిల్లాల నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు ఇప్పటికే నామినేషన్లు వేయడం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్సీలను కలుపుకొంటే, ఈ నెలాఖరులోగా మండలిలో వైసీపీ బలం 32కు పెరగనుంది. మరోవైపు,
శాసన మండలి రద్దు బిల్లుపై శాసన సభలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శానన మండలి రద్దు చేస్తున్నట్లు గతంలో ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మూడు రాజధానుల బిల్లుల్ని వెనక్కి తీసుకున్న మరుసటిరోజే మండలి బిల్లును సైతం జగన్ సర్కారు ఉపసంహరించుకోవడం గమనార్హం. అయితే, మూడు రాజధానుల్లాగే మండలి రద్దుకు కూడా మరోసారి కొత్త బిల్లు పెడతారా? లేక ఎలాగూ బలం సాధించారు కాబట్టి మండలిని కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Mlc elections, Ysrcp