NEW CYCLONE TENSION FOR ANDHRA PRADESH WEATHER UPDATE AK
Weather Update: ఏపీకి మరో టెన్షన్.. పొంచి ఉన్న మరో తుపాను ప్రమాదం
ప్రతీకాత్మక చిత్రం
Weather Update: ఇప్పటికే నివర్ తుపాను ఏపీలోని అనేక జిల్లాల ప్రజలు, రైతులను తీవ్రంగా నష్టపరిచింది. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని ప్రజలు భయపడుతున్నారు.
నివర్ తుపాను నుంచి ఇంకా కోలుకోని తమిళనాడు, ఏపీ రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. నేడు ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో డిసెంబరు 1 నుంచి 3 వరకు తమిళనాడు, పుదుచ్చేరిలోని కరైకల్లో అతి భారీ వర్షాలు, ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం వాతావరణశాఖ పేర్కొంది. ఇప్పటికే రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో చాలాచోట్ల ఆదివారం భారీవర్షం కురిసింది.
ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం వద్ద కేంద్రీకృతమైన ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ కేంద్రం తెలిపింది. తొలుత వాయుగుండంగా మారే ఈ అల్పపీడనం తరువాత 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ డిసెంబర్ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని చేరే అవకాశం ఉందని వెల్లడించింది.
మరోవైపు ఇప్పటికే నివర్ తుపాను ఏపీలోని అనేక జిల్లాల ప్రజలు, రైతులను తీవ్రంగా నష్టపరిచింది. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పలు చెరువులు, కుంటలు, రోడ్ల తెగిపోయాయి. జాతీయ రహదారుల్లో సైతం వంతెనలు తెగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. పంటచేలు చెరువులను తలపిస్తున్నాయి. కోతకొచ్చిన వేలాది హెక్టార్ల వరి పంట నీటమునిగింది. ఇప్పటికే చెరువులు, కుంటలు, నదులు నిండుగా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా వర్షాలు పడితే మరింత ప్రమాదమని ప్రజలు భయపడుతున్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.