Polaa Sudha, News18, Nellore
భిన్నత్వంలో ఏకత్వం చాటిన పుణ్యభూమి మన భారతదేశం (India). ఆ పుణ్యభూమిలో ఎందరో మహనీయులు జన్మించారు. అలా మన దేశకీర్తిని ఖండాంతరాలకు చాటిన వారిలో ముఖ్యులు పూజ్య బాపూజీ. సత్యానికి, ధర్మానికి ప్రాణప్రతిష్ట చేసిన మహనీయుడు. అహింసను ఆయుధంగా మలిచిన మహాత్ముడు. అందుకే ఆయన యావత్ భారతావనికి జాతి పిత అయ్యాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. మహాత్ముడు నడయాడిన నేలలో ప్రతీ ప్రదేశం ప్రత్యేకమైనదే. చారిత్రాత్మకమైనదే. అలాంటి చారిత్రాత్మక ప్రదేశాలలో ఒకటే నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు గ్రామం. స్వాతంత్య్ర సమరంలో ప్రతి భారతీయుడు అహింస అనే ఆయుధం ధరించాలని పురిగొల్పుతూ దేశాటన చేస్తూ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని నెల్లూరు జిల్లా (Nellore District) కు వచ్చారు మహాత్ముడు. అందులో భాగంగానే పల్లిపాడు గ్రామాన్ని ఆయన సందర్శించారు.
ఈ పల్లిపాడు గ్రామం దక్షిణాదిన స్వాతంత్య్ర పోరాటానికి కేంద్ర బిందువైంది. పినాకిని నదితీరాన బాపూజీనే.. స్వయంగా ఒక ఆశ్రమాన్ని ప్రారంభించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలకు అప్పట్లో ఈ ఆశ్రమం వేదికగా నిలిచింది. అందుకే పల్లిపాడులోని గాంధీజీ ఆశ్రమం దక్షిణ భారతదేశ సబర్మతిగా పేరుగాంచింది.
మహాత్ముడి స్వహస్తాలతో ప్రారంభమైన గాంధీ ఆశ్రమం ఓ చారిత్రక చిహ్నంగా మారింది. ఈ ఆశ్రమ ఏర్పాటులో పల్లిపాడుకు చెందిన చతుర్వేదుల కృష్ణమూర్తి కీలకపాత్ర పోషించారు. ఈ ఆశ్రమం ఏర్పాటు కోసం పొణకా కనకమ్మ భూదానం చేశారు. దక్షిణాఫ్రికాకు చెందిన గాంధీజీ మిత్రుడు రుస్తుంజీ 10 వేల రూపాయల విరాళం అందచేశారు. ఆయన చేసిన సాయానికి గుర్తుగా రుస్తుంజీ పేరుతో ఇక్కడ భవనం ఉంటుంది. ఇక ఉద్యమకారులు, భారతీయులు ఇచ్చిన విరాళాలతో నిర్మితమైన ఈ ఆశ్రమాన్ని 1921 ఏప్రిల్ 7న గాంధీజీ ప్రారంభించారు. గతేడాది 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుందీ ఆశ్రమం.
ప్రశాంత వాతావరణంలో పినాకినీ నదీ తీరాన 22 ఎకరాల్లో ఈ గాంధీ ఆశ్రమం ఏర్పాటైంది. ఈ ఆశ్రమ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఖాదీ ఉత్పత్తి, అంటరానితనం నిర్మూలన, హిందీని జాతీయ భాషగా ప్రచారం చేయడం, ప్రకృతి వైద్యం, సర్వమత సమానత్వం, వయోజన విద్యను ప్రోత్సహించడం.
ఆశ్రమ ప్రవేశంలో గాంధీజీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలో ఓపెన్ ఎయిర్ స్టేడియం, గాంధీజీ డిజిటల్ మ్యూజియం, ఫుడ్ కోర్టు, గ్రంథాలయం, పర్యాటకులకు విశ్రాంతి భవనం లాంటివి నిర్మించారు. ఇక్కడ ఉన్న ఫొటో గ్యాలరీ అప్పటి చారిత్రక ఘట్టాలకు, స్వరాజ్య పోరాట స్ఫూర్తికి అద్దం పడుతుంది.
ఆశ్రమంలో డీ అడిక్షన్ కేంద్రాన్ని కూడా ఏర్పాటుచేశారు. సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. కాలక్రమేణా ఈ ఆశ్రమ బాధ్యతలను రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో పాత బిల్డింగ్ను కాస్త మెరుగులు దిద్దింది. జాతిపిత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరిలో రగిలించిన ఈ పినాకినీ గాంధీ ఆశ్రమాన్ని టూరిస్టు ఎట్రాక్షన్ ప్లేస్గా మార్చారు.
టైమింగ్స్: ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సందర్శనకు ఉంచారు.
అడ్రస్ : మహాత్మా గాంధీ కాలనీ, పల్లిపాడు, ఇందుకూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ -524314.
ఎలా వెళ్లాలి?
నెల్లూరు నుంచి పల్లిపాడుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Nellore