Polaa Sudha, News18, Nellore
నెల్లూరు (Nellore) నగరంలో నాగ సాధువులు ప్రత్యక్షమయ్యారు. కాశీ నుంచి వచ్చిన నాగసాధువులు ఇరుకళల పరమేశ్వరీ దేవస్థానం వద్ద స్వర్ణాల చెరువు సమీపంలో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డులో ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద సాధువులు హఠాత్తుగా కనిపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటికే అక్కడ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గణేష్ నిమజ్జన ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పోరేషన్ సిబ్బంది, ఇతర అధికారులతో ఆయన ఏర్పాట్ల గురించి చర్చిస్తున్నారు. ఘాట్ వద్ద పరిసరాలు, బ్యారీకేడ్ల ఏర్పాటు, పారిశుద్యం నిర్వహణ, భక్తుల సౌకర్యాలు, మంచినీటి వసతి, హెల్ప్ డెస్క్, భద్రతా తీరుతెన్నులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో నాగసాధువులు ఒక్కసారిగా ఘాట్ వద్దకు దూసుకొచ్చి శ్రీధర్రెడ్డి ముందు ప్రత్యక్షం అయ్యారు.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గరకు వచ్చిన నాగ సాధువులు.. ఆయన ఎదుట నిలబడి మీ పేరు ఏమిటి ? అని అడిగారు. ఆయన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని సమాధానం ఇవ్వగానే.. మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, ఒక సోదరుడు ఉన్నారంటూ చెప్పారు. భవిష్యత్తులో మీరు మంత్రిగా ఎదుగుతారని శ్రీధర్ రెడ్డి భవిష్యత్తు గురించి జోస్యం చెప్పారు.
గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఘాట్ ఏర్పాటు చేశారన్న విషయం తెలుసుకుని ఆయనను అభినందించారు. రూరల్ నియోజకవర్గంలో ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ది కోసం శ్రీధర్ రెడ్డి పడుతున్న కష్టాన్ని తెలుసుకుని మెచ్చుకున్నారు. ఈశ్వరుడి అనుగ్రహం మీకు ఉందంటూ శ్రీధర్ రెడ్డిని నాగసాధువులు ఆశీర్వదించారు. నాగసాధువులు తనని ఆశీర్వదించిన విషయంపై శ్రీధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నాగసాధువుల ఆశీస్సులు నెరవేరతాయని, మంత్రి అవ్వడానికి తాను శతవిధాలా తాను కృషి చేస్తానంటున్నారు.
గతంలో మంత్రివర్గ విస్తరణ సమయంలోనూ శ్రీధర్రెడ్డి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంత్రి పదవి ఆశించిన ఆయన చివరకు అది కాకాణి గోవర్దన్ రెడ్డికి ఆ పదవి వెళ్లడంతో కాస్త నిరాశపడినట్లు సమాచారం. కానీ తర్వాత తేరుకుని మళ్లీ గడప గడప కార్యక్రమంతో బిజీ అయ్యారు. గడప గడపలో జోరు చూపించి సీఎం జగన్ ప్రశంసలు సైతం అందుకున్నారు.
అయితే ఏపీలో మంత్రి పదవుల విషయంలో మొదటినుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తనకంటూ లెక్కలు చాలానే ఉన్నాయి. అందుకే ఎవ్వరికి అన్యాయం జరగకుండా రెండు విడతల్లో ఆయన మంత్రి మండలిని ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక న్యాయం పేరుతో అత్యంత సన్నిహితుల్ని సైతం మంత్రి పదవులకు దూరం పెట్టారనే విమర్శలు ఎదుర్కొన్నారు. అలా ఆ రెండు విడతల్లో ఇప్పటి వరకూ పదవులు దక్కని వారిలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఒకరు.
అయితే ముఖ్యమంత్రి నెల్లూరు పర్యటనకు ముందు శ్రీధర్ రెడ్డి మంత్రి పదవిపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమైంది. అయితే ఇప్పుడల్లా మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఊసే లేదు. ఇక ఈ సారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే నాగా సాధువుల దీవెనలుంటే సరిపోదు.., సీఎం జగన్ దీవెనలు కూడా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఉండాలి కదా అంటున్నరు జిల్లా వాసులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kotamreddy sridhar reddy, Local News, Nellore